ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు కేరళ

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 09:22 PM

రంజీ ట్రోఫీ 2024-2025 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్‌లో ఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఉత్కంఠగా సాగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో కేరళ జట్టు.. గుజరాత్‌పై పైచేయి సాధించింది. రెండో సెమీఫైనల్‌లో ముంబై జట్టును ఓఢించి.. విదర్భ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఫిబ్రవరి 26న ప్రారంభం కానున్న ఫైనల్‌లో కేరళ, విదర్భ జట్లు తలపడనున్నాయి.


తొలి సెమీఫైనల్‌ మ్యాచ్ కేరళ, గుజరాత్ మధ్య జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ రెండు జట్లూ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేరళ జట్టు 457 రన్స్‌కి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్.. తొలి ఇన్నింగ్స్‌లో కేరళ కంటే రెండు రన్స్ తక్కువకు అంటే 455 రన్స్‌కి పది వికెట్లు కోల్పోయింది. ఇవే రెండు పరుగులు గుజరాత్‌ ఫైనల్ చేరకుండా అడ్డుకున్నాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. రంజీట్రోఫీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు ఆధిక్యం సాధించిన కేరళ ఫైనల్‌కు చేరుకుంది.


నిజానికి ఈ మ్యాచ్‌లో కేరళకు గుజరాత్ గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఆ జట్టు ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా.. అదృష్టం మాత్రం కేరళ వైపే ఉంది. కేరళపై ఆధిక్యాన్ని సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన నేపథ్యంలో గుజరాత్ చివరి బ్యాటర్‌ నగస్వల్లా అనూహ్యంగా ఔటయ్యాడు. నగస్వాల్లా బలంగా షాట్ కొట్టాడు. ఆ బంతి ఫోర్‌ వెళ్తే.. గుజరాత్ ఫైనల్ చేరేదే. కానీ షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తాకిన ఆ బంతి.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సచిన్ బేబీ చేతుల్లో పడింది.


దీంతో గుజరాత్ ఆలౌట్ అయింది. ఫైనల్ చేరలేమనే విషయాన్ని తెలుసుకున్న గుజరాత్ శిబిరం.. నైరాశ్యంలో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన రెండు పరుగుల లీడ్‌ కేరళను తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేర్చింది. రెండో ఇన్నింగ్స్‌లో కేరళ 114/4 వద్ద ఉన్నప్పుడు ఇరు జట్ల కెప్టెన్‌లు డ్రాకు అంగీకరించారు. మ్యాచ్ డ్రా అయినా.. రంజీట్రోఫీ రూల్స్ ప్రకారం కేరళ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది.


ముంబైకి షాక్ ఇచ్చిన విదర్భ..


ఇక రెండో సెమీఫైనల్‌లో ముంబైని ఓడించి విదర్భ వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. గత సీజన్‌ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన విదర్భ.. ఈసారి సెమీఫైనల్‌లోనే ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లే విదర్భ 383 పరుగులు.. ముంబై 270 రన్స్ చేసింది. ఆ తర్వాత విదర్భ 292 రన్స్ చేసి.. ముంబై ముందు 406 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కానీ ముంబై 325 రన్స్‌కి ఆలౌట్ అయి.. 80 రన్స్ తేడాతో ఓడిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa