గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో స్మగ్లర్లు రూటు మార్చి కొత్త ఎత్తులు వేస్తున్నారు. లారీ డ్రైవర్లను రంగంలోకి దింపి.. తుక్కు మాటున గంజాయి తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వయా హైదరాబాద్ (Hyderabad) మీదుగా మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. దీనిని తరలించే డ్రైవర్లకు ఒక్కో ట్రిప్పుకి రూ.3 లక్షలు వరకు అందజేస్తున్నారు. అరకు నుంచి తుక్కు మాటున పుణేకు గంజాయి తీసుకెళ్తూ హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు ఓ స్మగ్లర్ పట్టుబడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కంటైనర్ లారీలో 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 1.05 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాచకొండ పోలీసులకు పట్టుబడిన నిందితుడు. ఇది వరకే రెండుసార్లు ఇలా గంజాయి స్మగ్లింగ్ చేశాడు. ఆ అనుభవంతోనే మూడోసారి ప్రయత్నించి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటుచేసి సంబంధిత వివరాలను వెల్లడించారు. మహరాష్ట్రలోని పూణేకు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ అనే డ్రైవర్.. టాటా మోటార్స్కు చెందిన సామాగ్రిని భారీ కంటైనర్లో వేరే రాష్ట్రాలకు తరలిస్తుంటాడు. ఈ క్రమంలో పుణేకు చెందిన వైభవ్, దేవా అనే ఇద్దరు గంజాయి స్మగ్లర్లు.. గులాబ్ షేక్ను కాంటాక్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతం నుంచి గంజాయిను రహస్యంగా తీసుకొచ్చి తమకు అప్పగిస్తే ఒక్కో ట్రిప్పునకు రూ. 3లక్షలు చెల్లిస్తామని చెప్పారు. కంటైనర్లో సామాగ్రిని దింపేసి.. తిరిగి వచ్చేటప్పుడు గంజాయి తీసుకురావాలని అన్నారు. ఆ ఆఫర్ బాగుందని, జీవితంలో సెటిల్ అయిపోవచ్చని అందుకు గులాబ్ షేక్ అంగీకరించాడు. తన ప్లాన్ ప్రకారం ఒక్కడే వాహనంలో వెళ్లి.. గంజాయి రహస్యం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొదటిసారి 200 కిలోలు, రెండోసారి 150 కిలోల గంజాయిని తీసుకొచ్చి వైభవ్, దేవాలకు అప్పగించాడు. వాళ్ల వద్ద నుంచి ట్రిప్పునకు రూ. 3లక్షలు తీసుకున్నాడు.
ఇటీవల టాటా మోటార్స్కు సంబంధించిన టూల్స్ ఎక్విప్మెంట్ను కంటెయిన్లో విశాఖపట్నం తీసుకొచ్చిన గులాబ్ షేక్.. వాటిని అక్కడ డెలివరీ చేశాడు. అక్కడ స్మగ్లర్ల సూచన మేరకు తుక్కును లోడ్ చేసుకుని బయలుదేరి.. అరకు వెళ్లాడు. గంజాయి సరఫరాదారు బుజ్జిబాబును కలిసి.. 300 కిలోల సరుకు లోడ్ చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పైన స్క్రాప్ వేశాడు. మూడు రోజుల కిందట సరుకు లోడ్ చేసుకుని అరకు, రాజమండ్రి, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నాడు.
కంటెయినర్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రవికుమార్, అబ్ధుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి బృందం ఎస్వోటీ అడిషనల్ డీసీపీ షేక్ హుస్సేన్ నేతృత్వంలో దాడిచేసి లారీని పట్టుకున్నారు. డ్రైవర్ గులాబ్ షేక్ను అదుపులోకి తీసుకుని.. 300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గులాబ్ షేక్ ఇచ్చిన సమాచారంతో వైభవ్, దేవాల కోసం ప్రత్యేక టీమ్ను పుణెకు పంపుతున్నట్టు సీపీ సుధీర్ బాబు తెలిపారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa