ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను భర్త కట్నం డిమాండ్ చేయడం క్రూరత్వం కాదు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 08:55 PM

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా భార్యాబాధితుల కేసుల్లో వేధింపులు, ఒత్తిడి తట్టుకోలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా బలవన్మరణానికి పాల్పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మొన్నటికి మొన్న ఒడిశాకు చెందిన ఓ ఫేమస్ ర్యాపర్.. భార్య వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న సంఘటన తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అంతకుముందు బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఈ భార్యా బాధితుల సంఘటనతో ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలోనే భార్యా బాధితులు.. సోషల్ మీడియా వేదికగా ఇలాంటివి అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు ఉన్న ప్రత్యేక చట్టాలను అడ్డు పెట్టుకుని.. భార్యలు భర్తలు, అతని కుటుంబ సభ్యులపై పగ తీర్చుకుంటున్నారనే వాదనలు ఎక్కువ అవుతున్నాయి.


ఇలాంటి సమయంలోనే తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కట్నం డిమాండ్‌ చేయడం క్రూరత్వం కాదని వెల్లడించింది. భార్య నుంచి భర్త కట్నం డిమాండ్‌ చేయడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. భర్త, అత్తమామల నుంచి పెళ్లి అయిన మహిళలకు రక్షణ కల్పించేందుకు 1983లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐపీసీ సెక్షన్‌ 498ఏ ప్రకారం.. కట్నం డిమాండ్‌ క్రూరమైన నేరం కాదని స్పష్టం చేసింది. సెక్షన్‌ ప్రకారం 498ఏ ప్రకారం క్రూరత్వం అనేపదానికి విస్తృతమైన అర్థం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.


కట్నం కింద భార్య కుటుంబానికి సంబంధించిన ఆస్తులు గానీ.. విలువైన వస్తువులు గానీ ఇవ్వాలని డిమాండ్‌ చేయడం చట్టవిరుద్ధమేనని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే కట్నం కోసం మహిళను శారీరకంగా, మానసికంగా వేధించడం మాత్రం క్రూరత్వం అవుతుందని స్పష్టం చేసింది. కేవలం భార్యను భర్త కట్నం డిమాండ్‌ చేశారనే ఆరోపణలతో 498ఏ సెక్షన్‌ కింద కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలీలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం గత ఏడాది డిసెంబర్‌ 12వ తేదీన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 498ఏ సెక్షన్‌ను ఉపయోగించుకుని.. భర్త, అత్తమామలు, అత్తింటివారిపై కొందరు మహిళలు.. దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa