దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అవుతోంది. అయితే ఈ పథకం ద్వారా ఆయా రాష్ట్రాల్లోని స్థానికంగా ఉన్న మహిళలు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించారు. కానీ ఈ పథకం వల్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీలకు ఈ పథకం ద్వారా మరింత ఆర్థిక లోటు వస్తోందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఉచిత ప్రయాణం అనగానే మహిళలు తండోప తండాలుగా బస్సుల్లోకి రావడంతో భారీగా రద్దీ నెలకొంటోంది. ఇక సీట్ల కోసం మహిళలు సిగపట్లు పట్టుకుని కొట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నారు. దీనికితోడు.. పురుషులకు సీట్లు లేకుండా మొత్తం మహిళలే ఆక్రమిస్తున్నారు. పురుషులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా తాజాగా ఆర్టీసీ ఒక ఉపాయం ఆలోచించి.. అమలు చేస్తోంది.
అయితే ఈ నిర్ణయం తీసుకుంది మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం. తెలంగాణతోపాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. తెలంగాణ కంటే ముందే ఈ ఉచిత బస్సు పథకాన్ని ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఇక కర్ణాటకలోని బస్సుల్లో పురుషులకు కూర్చేనేందుకు కాదు కదా.. కనీసం నిలబడేందుకు కూడా కొన్ని సార్లు చోటు ఉండటం లేదు. దీనిపై చాలా మంది పురుషులు ఇప్పటికే చాలాసార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బస్సుల్లో కొన్ని సీట్లు పురుషులకు కేటాయించాలని కర్ణాటక ఆర్టీసీకి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లను కూడా మహిళా ప్రయాణికులు ఆక్రమించుకుంటున్నారనే వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మైసూరు నగర విభాగం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల్లో పురుషులకు నిర్దేశించిన సీట్లలో వాళ్లనే కూర్చునేలా చూడాలని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. 2023లో కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించే శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని అన్ని రవాణా సంస్థలు పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. అయితే పురుషులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చోవచ్చు.. కానీ వారు వచ్చి అడిగితే మాత్రం మహిళలు అందులో నుంచి లేవాల్సి ఉంటుంది. కానీ ఈ విధానం సరిగా అమలు కాకపోవడంతో పురుషులకు నిలబడాల్సి వస్తుంది.
ఈ క్రమంలోనే ఎస్ విష్ణువర్ధన అనే ప్రయాణికుడు.. కర్ణాటక ఆర్టీసీకి ఫిర్యాదు చేశాడు. పురుషుల సీట్లను కూడా మహిళలు ఆక్రమించుకుంటున్నారని.. అందువల్ల పురుషులకు సీట్లు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో అలర్ట్ అయిన మైసూరు నగర యూనిట్ డివిజనల్ కంట్రోలర్ తాజాగా ఒక నోటీస్ జారీ చేశారు. ఇకపై పురుషులకు కేటాయించిన సీట్లలో వాళ్లే కూర్చునేలా ఆర్టీసీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa