అతనో వెరైటీ దొంగ. కేవలం పగలు మాత్రమే చోరీలు చేస్తాడు. పక్కాగా ప్లాన్ వేసి, ఆ ప్లాన్ అమలు చేసి ఇళ్లల్లోకి చొరబడతాడు. చాకచక్యంగా ఆ ఇంట్లోని నగలు, నగదు కాజేస్తాడు. ఆ తర్వాత చోరీ చేసిన బంగారాన్ని కరిగించి, బంగారు బిస్కెట్లుగా మారుస్తాడు, ఆ బంగారు బిస్కెట్లను బంగారు దుకాణాలకు విక్రయిస్తుంటాడు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతను కేవలం పగలు మాత్రమే దొంగతనాలు చేస్తుంటాడు. దీని వెనుక ఆసక్తికర కారణం ఉంది. ఆ దొంగ ఎవరు, అతను పగలు మాత్రమే చోరీలు చేయడానికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని నారాయణమ్మ కాలనీలో జనవరిలో ఓ దొంగతనం జరిగింది. ఓ టీచర్ ఇంట్లోకి పట్టపగలే ప్రవేశించిన దొంగ.. ఆ ఇంట్లోని బంగారం కాజేశాడు. ఇంటిలో దాచుకున్న 470 గ్రాముల బంగారాన్ని చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. చోరీ సంగతిని తర్వాత గుర్తించిన టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చోరీ చేసింది బెంగళూరుకు చెందిన సుహాన్ ఖాన్గా గుర్తించారు. అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 13న సుహాన్ ఖాన్ను కర్ణాటక జిల్లా తుమ్మకూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలోనూ పలు చోరీలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పెనుకొండలో బంగారు ఆభరణాలు చోరీచేసిన సుహాన్ ఖాన్.. వాటిని బంగారం బిస్కెట్లుగా మార్చి హైదరాబాద్లో విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. రూ. 29 లక్షలకు ఈ బంగారు బిస్కెట్లను విక్రయించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఫిబ్రవరి 3న కుప్పంలో ఓ ఇంట్లో బంగారం చోరీ చేసినట్లు తెలిపారు. అయితే నిందితుడు సుహాన్ ఖాన్కు రేచీకటి ఉందన్న పోలీసులు.. ఈ కారణంగా అతను పగలు మాత్రమే దొంగతనాలు చేసేవాడని వివరించారు.
సుహాన్ ఖాన్ చోరీ చేసిన తర్వాత.. అక్కడ దొంగిలించిన బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాడని.. ఇందుకు కావాల్సిన సామాగ్రిని ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 350 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa