ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ సీఎం ఆఫీస్‌లో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 08:30 PM

ఢిల్లీలో రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తొలిసారి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం ఆఫీస్‌లో నుంచి బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్‌ల ఫోటోలను.. బీజేపీ సీఎం వచ్చిన తర్వాత తొలగించారని.. మాజీ సీఎం, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆతిశీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఆప్‌ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో తొలిరోజే ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో రసాభాస చోటు చేసుకుంది.


సీఎం కార్యాలయం నుంచి అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌ల ఫొటోలు తొలగించి.. మరోసారి బీజేపీ దళిత, సిక్కు వ్యతిరేక పార్టీ అని రుజువు చేసుకుందని ఆతిశీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలో గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు.. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అంబేడ్కర్‌, భగత్‌ సింగ్‌ల ఫొటోలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆతిశీ గుర్తు చేశారు. అయితే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం ఆఫీస్‌ నుంచి వారి ఫొటోలను తొలగించారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన చేపట్టారు.


ఇక ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష ఆప్ ఎమ్మెల్యేలు చేపడుతున్న నిరసనలపై అసెంబ్లీ స్పీకర్‌గా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగడం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇష్టం లేదని.. అందుకే వారు సభకు అంతరాయం కలిగించేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశాలను రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా ఆప్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు. అయినప్పటికీ ఆప్ ఎమ్మెల్యేలు శాంతించకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.


మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఢిల్లీ అసెంబ్లీ బయట ఆప్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం.. తమ మొదటి మంత్రివర్గ సమావేశంలోపు ప్రతి మహిళ ఖాతాలో రూ.2500 జమ చేస్తామని హామీ ఇచ్చి.. ఆ మాటను తప్పిందని ఆప్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మార్చి 8వ తేదీ నాటికి ఢిల్లీలోని ప్రతి మహిళ ఖాతాలో మహిళా సమ్మాన్ యోజన కింద మొదటి విడత డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అయితే తాము గత 2 రోజులుగా సీఎం రేఖా గుప్తాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా.. తమకు సమయం ఇవ్వట్లేదని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com