అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మళ్లీ సిట్టింగ్లకే అవకాశమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప మళ్లీ బరిలోకి దిగనున్నారు. హిందూపురం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి సమర శంఖం పూరించనున్నారు. పెనుగొండ నుంచి పార్థసారధి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ్రెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, మడకశిర నుంచి వీరన్న బరిలోకి దిగనున్నారు.
పార్టీ శ్రేణులు భావించినట్టుగానే రాప్తాడు నుంచి మంత్రి పరిటాల సునీత మళ్లీ పోటీ చేయనున్నారు. కదిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కదిరిని చంద్రబాబు పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది. కదిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్భాషా, కందికుంట ప్రసాద్ రేసులో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్భాషా వైసీపీలో గెలిచి టీడీపీలో చేరారు. టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.