తొంభై నాలుగు లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు పసుపు-కుంకుమ కింద రెండో సారి ఇస్తున్న రూ.10 వేల సొమ్ములో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన రూ.3,500 అందుతాయని, ఇందుకు అవసరమైన సొమ్మును బ్యాంకులలో జమచేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లు త్వరలో ప్రతి ఒక్క స్వయం సహాయక మహిళ బ్యాంకు ఖాతాలో మిగిలిన రూ.4000 జమచేస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిహక్కును తీసుకొచ్చి మహిళా సాధికారతకు మహానాయకుడు ఎన్టీరామారావు బాట వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్లాఘించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలలో, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు. దళిత మహిళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా చేశామని, కేబినెట్ లోకి మహిళా మంత్రులను తీసుకున్నామని తెలిపారు.
నవ్యాంధ్రప్రదేశ్ లో మహిళా సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నామన్నారు. అంగన్ వాడీ టీచర్లు, సహాయకుల జీతాలను రెండు దఫాలుగా పెంచామని సీఎం చెప్పారు. ఐదేళ్ల కాలంలో 18,301 అంగన్ వాడీ కేంద్రాలు, అలాగే 103 సీడీపీఓ కార్యాలయాలకు భవనాలను నిర్మించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. మహిళా హోమ్ గార్డుల ప్రసూతి సెలవు పెంచినట్లు తెలిపారు.