తిరుపతి సుందరీకరణలో భాగంగా టిటిడి 26 కిలోమీటర్ల మేర నిర్వహిస్తున్న 9 రోడ్లలో పచ్చదనాన్ని మరింతగా పెంచి ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి రోడ్లు, ముద్రణాలయం, ప్రచురణల విభాగం, సప్తగిరి మాసపత్రిక కార్యాలయం, ప్రచురణల విక్రయ విభాగాలను గురువారం జెఈవో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రోడ్ల మధ్యగల డివైడర్లలో రంగురంగుల పూలమొక్కలు పెంచడం ద్వారా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామన్నారు. మొక్కల పెంపకానికి డ్రిప్ ఏర్పాటుచేసి నీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. విమానాశ్రయాల తరహాలో పచ్చదనం పెంపు ద్వారా తిరుపతిని మరింత అందమైన నగరంగా మారుస్తామన్నారు. అదేవిధంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వసతి సముదాయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్లో నిర్మించిన శ్రీవారి ఆలయంలో ఆహ్లాదకరంగా పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. సప్తగిరి మాసపత్రిక సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, మొత్తం లక్షా 10 వేల మంది పాఠకులకు క్రమం తప్పకుండా పత్రిక అందేలా ఎప్పటికప్పుడు చిరునామాలు అప్డేట్ చేయాలని సూచించారు. ప్రచురణల విభాగం కార్యాలయంలో గాలి వెళుతురు సరిగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రచురణల విక్రయ విభాగంలోని ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని మరింత ఎక్కువమంది పాఠకులు సందర్శించేలా ప్రచారం కల్పిస్తామన్నారు.
అంతకుముందు అలిపిరి నుండి నంది సర్కిల్, లీలామహల్ కూడలి, మంగళం రోడ్, రామానుజ సర్కిల్, తిరుచానూరు రోడ్, లక్ష్మీపురం, అన్నమయ్య సర్కిల్, ఎంఆర్.పల్లి సర్కిల్, బాలాజి కాలనీ, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వరకు గల రోడ్ల మధ్యలో పచ్చదనాన్ని పరిశీలించారు.
జెఈవో వెంట టిటిడి డిఎఫ్వో శ్రీ ఫణికుమార్ నాయుడు, ఎస్ఇ-1 శ్రీ రమేష్రెడ్డి, చీఫ్ ఎడిటర్ డా.. రాధారమణ, డెప్యూటీ ఈవోలు శ్రీ విజయకుమార్, శ్రీ హేమచంద్రారెడ్డి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా..టి.ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa