ఓ రైతు రోజు మాదిరిగానే ఉదయాన్నే పంట పొలానికి బయల్దేరాడు. దారిన వెళ్లే తోటి రైతులను పలకరించుకుంటూ పొలానికి నీళ్లు పెట్టేందుకు ముందుకు వెళ్తున్నాడు. మరో నాలుగు అడుగులు వేస్తే తన పొలం వస్తుంది. తన పొలం కంటే ముందే దాయాది పొలం ఉంది. అయితే ఆ పొలంలోని వరి పైరులో అనుమానస్పదంగా ఓ సంచి కనిపించింది. ఏదో తేడాగా ఉందే అనుకుంటూ భయం భయంగానే సంచి వద్దకు చేరుకున్నాడు రైతు. సంచి ఓపెన్ చూసి అందులో కనిపించింది చూసి షాక్ తిన్నాడు. సంచిలో మెుత్తం నోట్ల కట్టలే. అన్నీ కూడా రూ. 500 నోట్లే సుమారు 40 వరకు కట్టలు ఉన్నాయి.
ఇక తన పంట పండిందని.. తన అప్పులు, కష్టాలు తీరిపోతాయని ఆ రైతు ఆశగా అందులోని డబ్బులను తీసుకున్నాడు. ఇంతలో మరో రైతు అక్కడకు రాగా.. అతడు కూడా నోట్ల కట్టలు చూశాడు. ఇంత డబ్బు ఇక్కడెవరు పడేశారబ్బా అనుకుంటూనే నోట్లను అటు ఇటు తిప్పి చూశాడు. అవి అసలు నోట్లు కావని గుర్తించాడు. దీంతో రైతుల ఆశలు ఆవిరైపోయాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసి చివరకి పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు వచ్చి ఆ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పొత్తలపాలెం వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ రైతు ఇవాళ ఉదయం తన పంట పొలానికి బయల్దేరాడు. నార్కట్పల్లి-అద్దంకి రోడ్డు వెంట తన దాయాది పొలంలోసుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు పేర్చి ఉన్న సంచిని గుర్తించాడు. అందులో ఉన్న డబ్బును మరో రైతుతో కలిసి పరిశీలించి చూడగా.. అవి నకిలీ నోట్లను తేలింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. పొలంలోని రూ. 500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఫేక్ కరెన్సీపై 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అని ముద్రించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అవన్నీ ఫేక్ కరెన్సీ అని పోలీసులు వెల్లడించారు. అసలు ఈ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణ తర్వాత వాటిని అక్కడ ఎవరు పడేశారు? ఎందుకు వినియోగిస్తున్నారనే విషయాలు తెలుతాయని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa