ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఎస్ పౌరసత్వం కోసం ట్రంప్ సరికొత్త ఆఫర్

international |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 10:52 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపన్న వలసదారులు అందరికీ శుభవార్త చెబుతూ.. అమెరికాలో పౌరసత్వం పొందేందుకు ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించారు.ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను ఇవ్వబోతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే దీన్ని పొందాలనుకునేవారు 5 మిలియన్ల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందని కూడా వెల్లడించారు. దీని వల్ల తమ దేశ ఆదాయం పెరుగుతందని పేర్కొన్నారు. మరి ఈ గోల్డ్ కార్డ్ వీసా ఏంటి, దీనికి అర్హులు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ వల్ల అనేక మోసాలు, అక్రమాలు జరుగుతుండగా.. వాటన్నిటికీ అమెరికా సర్కారు చెక్ పెట్టింది. ముఖ్యంగా ఈబీ-5 వీసా ప్రోగ్రామ్ స్థానంలోకి గోల్డ్ కార్డ్ వీసాను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు నేరగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌యే ప్రకటించారు. అయితే 5 మిలియన్ల డాలర్లు చెల్లించి ఈ వీసాను కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. ఈ వీసాను పొందిన వాళ్లు అమెరికాలో మరింత ధనవంతులు అవుతారని కూడా ట్రంప్ వెల్లడించారు.


గోల్డ్ కార్డ్ వీసా దారుల అనేక విజయాలు సాధిస్తారని, వారు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు కూడా చెల్లిస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వీరి వల్ల దేశం రుణం తగ్గుతుందని వివరించారు. మిలియన్ గోల్డ్ కార్డ్ వీసాలను అమ్మడం వల్ల మొత్తంగా 5 ట్రిలియన్ల డాలర్లు వస్తాయని కూడా అంచనా వేశారు. తాము అనుకున్నదానికంటే ఎక్కువ మంది వీటిని తీసుకుంటే మరింత ఆదాయం వస్తుందని తెలిపారు. తమకు మొత్తంగా 35 ట్రిలిటన్ల డాలర్ల అప్పు ఉందని.. వీటి వల్ల దాన్ని పూర్తిగా తీర్పేయొచ్చని చెప్పుకొచ్చారు.


అలాగే దీనిపై వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్ని స్పందిస్తూ.. మరో రెండు వారాల్లో ఈబీ-5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఇది కూడా ఒక రకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గోల్డ్ కార్డు లాంటిదేనన్నారు. ఈబీ-5 ప్రోగ్రామ్ వల్ల జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకు వస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని వివరించారు.


ఇదంతా ఇలా ఉండగా.. ఈబీ-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించగా.. 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు మొత్తంగా 8 వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీసా విధానంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారంటూ ఆరోపణలు రాగా.. దీని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాలను అందుబాటులోకి తీసుకువచ్చింది యూఎస్ సర్కారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa