ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ అరాచకం మనం సృష్టించుకున్నదే.. బంగ్లా ఆర్మీ చీఫ్

international |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 10:25 PM

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో.. దేశం మొత్తం సర్వనాశనమైన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌కి తత్వం బోధపడినట్టుంది. ఇప్పుడేమో దేశం ప్రమాదంలో ఉందని, ఇది చేజేతులా మనం చేసుకున్నదే అంటూ నిటూర్పులు విడిస్తే ఏం లాభం. గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమంతో బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. ఈ ఉద్యమ దెబ్బకు ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇండియాకు వచ్చారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. దేశంలో నెలకున్న అస్థిర పరిస్థితులపై తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సామాజిక ఆర్ధిక సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను ఏకరవుపెట్టిన ఆర్మీ చీఫ్.. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పౌరులు నిరంతరం ఒకరినొకరు దూషించుకోవడంలో నిమగ్నమై ఉన్నారని అన్నారు.


బుధవారం సాయుధ దళాలకు చెందిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ జమాన్ మాట్లాడుతూ.. ‘మనం చూస్తోన్న అరాచకం మనమే సృష్టించుకున్నది’ అని అన్నారు. పోలీసుల నిస్సహాయతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ నుంచి జూనియర్ వరకు అన్ని స్థాయిల అధికారులు భయపడుతున్నారని, ఎందుకంటే వారి సహచరులు న్యాయపరమైన కేసులను ఎదుర్కొవడం లేదా జైలుకు వెళ్లారని అన్నారు. క్షీణిస్తోన్న శాంతిభద్రతలు సాయుధ దళాలపై మరింత బాధ్యతను పెంచుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఐక్యత, వ్యవస్థలో క్రమశిక్షణ అత్యవసరమని నొక్కిచెప్పారు.


‘విబేధాలను అధిగమించకుండా మీలో మీరు పోరాడుతూ ఉంటే.. ఒకరినొకరు కొట్టుకుని చస్తే దేశ స్వాతంత్ర్యం, సమగ్రత ప్రమాదంలో పడతాయి.. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.. నాకు ఇంకా ఏం కోరికలు లేవు.. గత ఏడెనిమిది నెలలుగా జరిగిన నష్టం చాలు.. అయ్యిందేదో అయిపోయింది.. ఇకనైనా ఒక్కటిగా వెళ్దాం .. నేతలు ఒకరినొకరు నిందించుకోవడంలో బిజీగా ఉండటం వల్ల, దుండగులు పరిస్థితిని అనుకూలంగా భావిస్తారు. దేనినైనా తప్పించుకోగలమని వాళ్లు నమ్ముతున్నారు..’ అని బంగ్లా పౌరులకు ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చారు.


షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన విద్యార్థుల నేతృత్వంలోని విప్లవం ప్రయోజనాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని జనరల్ జమాన్ పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో హసీనా రాజీనామా చేసిన భారత్‌కు పారిపోయిన తర్వాత ఆర్మీ చీఫ్‌గా జనరల్ వకార్ ఉజ్ జమాన్ బాధ్యతలు చేపట్టారు. హసీనా దేశం వీడిన తర్వాత బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత ముహమూద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్కడ పరిస్థితులు ఏ మాత్రం చక్కబడలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa