ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంటు తీసేసి, తలుపులు లాక్ చేసి ఫ్యాకల్టీకి చుక్కలు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 10:29 PM

ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు.. కాలేజీ క్యాంపస్‌లోనే హోలీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కానీ యాజమాన్యం మాత్రం వద్దని చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, ఇతర సిబ్బందిని ఓ సెమినార్ హాల్లో పెట్టి లాక్ చేశారు. కరెంటు కూడా తీసి 150 మంది సిబ్బందికి గంట పాటు చుక్కలు చూపించారు. హోలీ వేడుకలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చేవరకు బయటకు రానీయమంటూ గొడవ పడ్డారు. ఆపై ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ కథ చదివేయాల్సిందే.


మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీ విద్యార్థులు.. క్యాంపస్‌లోనే హోలీ వేడుకలు చేసుకోవాలని భావించారు. అందరూ కలిసి మార్చి 7వ తేదీన హోలీ పండుగ చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. కళాశాల యాజమాన్యం వద్ద నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కాలేజీలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే విషయం గుర్తించిన యాజమాన్యం తమ అనుమతి లేకుండా హోలీ సంబురాలు చేసుకోవడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది. అలాగే పిల్లలు ఏర్పాటు చేసిన పోస్టర్లను కూడా తొలగించింది.


సెమినార్ హాల్లో బంధించి కరెంటు తీసేసి..!


అయితే కాళాశాల యాజమాన్యం హోలీ సంబురాలను రద్దు చేయడంతో విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారు. ఈక్రమంలోనే ఫిబ్రవరి 24వ తేదీన మహిళా ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులతో సహా 150 మంది ఓ కార్యక్రమం నిమిత్తం సెమినార్ హాల్లో సమావేశం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లలు ఎలాగైనా సరే యాజమాన్యాన్ని హోలీ సంబురాలు చేసుకోవడానికి ఒప్పించాలని అక్కడకు వెళ్లారు. ఈక్రమంలోనే సెమినార్ హాల్ తలుపులు లాక్ చేసి బయటే నిలబడ్డారు. ఆపై కరెంటు కూడా తీసేసి వారిని గంటపాటు బంధించారు. సెమినార్ హాల్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.


హోలీ సంబురాలు చేసుకునేందుకు అనుమతి ఇస్తేనే తలుపులు తెరుస్తామంటూ రచ్చ చేశారు. ఇందుకు ప్రిన్సిపల్ అస్సలే ఒప్పుకోను అని చెప్పగా.. చాలా సేపు వేచి చూసి తలుపులు తెరిచారు. బయటకు వచ్చిన వెంటనే యజమాన్యం ఈ ఘటనపై చాలా సీరియస్‌గా స్పందించింది. విద్యార్థుల చర్యను తీవ్ర క్రమ శిక్షణా రాహిత్యంగా భావించి దర్యాప్తు చేపట్టింది. ఈక్రమంలోనే నలుగురు విద్యార్థి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమ శిక్షణా కమిటీ సిఫార్సు చేసింది. దీంతో కాలేజీ యాజమాన్యం నలుగురు విద్యార్థులను బహిష్కరించిందినట్లు ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. టీసీలు కూడా తీసుకుని వెళ్లిపోవాలని వివరించినట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa