ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన అఫ్ఘానిస్థాన్

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 11:04 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వర్చువల్‌ నాకౌట్ మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా ముందు 274 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్ఘానిస్థాన్.. పట్టుదలతో బ్యాటింగ్ చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో ఆ జట్టు ఆస్ట్రేలియా ముందు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిలిపింది. సరిగ్గా 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అప్ఘానిస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్.. డకౌట్‌ అయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో విరుచుకుపడ్డ ఇబ్రహీం జద్రాన్ ఈ మ్యాచ్‌లోనూ మంచి శుభారంభం ఇచ్చాడు. అయితే భారీ ఇన్నింగ్స్‌గా మాత్రం మలచలేకపోయాడు. 28 బంతుల్లో 22 రన్స్ చేసిన అనంతరం అతడు ఔట్ అయ్యాడు.


ఈ సమయంలో సెదిఖుల్లా అటల్‌ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో పాతుకుపోవడానికి ప్రాధాన్యం ఇచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే 95 బంతుల్లో 85 రన్స్ చేసిన అనంతరం అతడు ఔట్ అయ్యాడు. దీంతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ దశలో అజ్ముతుల్లో ఒమర్జాయ్‌.. ఇన్నింగ్స్‌కు చక్కబెట్టే బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. 63 బంతుల్లో 67 రన్స్ చేసిన అతడు జట్టు స్కోరును 270 పరుగుల మార్కును దాటించాడు. 199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన అఫ్ఘానిస్థాన్‌ను ఆదుకున్నాడు.


జట్టు స్కోరు 272 వద్ద 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో అఫ్ఘానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ముందు 273 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌-బి నుంచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. దీంతో ఇరు జట్లూ కూడా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa