అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలపై ఉక్రెయిన్ అధినేత జెలన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అమెరికాతో సంబంధాలను కాపాడుకోగలనని, నిర్మాణాత్మక సంభాషణ కోసం అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళతానని చెప్పారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో శ్వేతసౌధంలో జరిగిన చర్చలు రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు లండన్లో ఐరోపా దేశాధినేతలతో జెలెన్స్కీ సమావేశమయ్యారు. అనంతరం తాజా పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో సందేశం విడుదల చేశారు. ఐరోపా నుంచి తమకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైందన్న జెలెన్ స్కీ .. శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపై అంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యమన్నారు. యుఎస్ నుంచి తమకు అందుతున్న సాయంపై ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, వారికి కృతజ్ఞతలు తెలుపని రోజు లేదని అన్నారు. సుదీర్ఘ యుద్ధం కాదు.. మాకు శాంతి కావాలి. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని చెబుతున్నామని జెలెన్స్కీ పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa