భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను లావుగా ఉంటాడని, అతడి ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడేనని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బీజేపీ నేతలతోపాటు క్రికెట్ అభిమానుల కూడా ఆమె వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు.సోషల్ మీడియా యూజర్ ఒకరు రోహిత్శర్మను ‘ప్రపంచస్థాయి ఆటగాడు’ అని కీర్తించాడు. దీనికి షమా స్పందిస్తూ.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, కపిల్దేవ్ వంటి భారత దిగ్గజాలతో పోలిస్తే అతడెంత అని పేర్కొంటూ యూజర్ వ్యాఖ్యలను తోసి పుచ్చారు. ‘‘అతడి ప్రపంచస్థాయి ఏమిటి? ఒక సాధారణ కెప్టెన్. టీమిండియాకు కెప్టెన్గా ఉండే అదృష్టం పొందిన ఒక సాధారణ ఆటగాడు’’ అని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన బీజేపీ.. ప్రపంచకప్ విన్నర్పై ఇవేం మాటలంటూ దుమ్మెత్తి పోసింది. బాడీ షేమింగ్ తగదని హితవు పలికింది. కాంగ్రెస్ తీరే అంత అని, దశాబ్దాలుగా అది క్రీడాకారులను అవమానిస్తూనే ఉందని కాంగ్రెస్ను వదిలి బీజేపీలో చేరిన రాధిక ఖేరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపైనా ఆమె విరుచుకుపడ్డారు. రోహిత్శర్మ తన జట్టును ప్రపంచకప్ విజయం వైపు నడిపిస్తే.. రాహుల్గాంధీ తన సొంత పార్టీని ఒక తాటిపైకి తీసుకురాలేక గందరగోళానికి గురవుతున్నారని విమర్శించారు. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన క్రికెటర్ను లక్ష్యంగా చేసుకోవడం మాని కాంగ్రెస్ ఔచిత్యం, విశ్వసనీయత, ఎన్నికల విధానంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్కు రాధిక సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa