ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లాంగ్ ఆన్లో ఉన్న విరాట్ కోహ్లి వికెట్ల దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న అక్షర్ పటేల్ కాళ్లు మొక్కాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తున్నాడేమో అనుకుంటే కిందకు వంగి కాళ్లు పట్టుకున్నాడు. అయితే, అక్షర్ పటేల్ మాత్రం నవ్వుతూనే వద్దు భాయ్ అంటూ అడ్డుపడ్డాడు.
గ్రూప్ స్టేజ్లో ఆఖరిది అయిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. న్యూజిలాండ్ జట్టులో ఒకపక్క వికెట్లు పడుతున్నా మరోవైపు కేన్ విలియమ్సన్ పోరాడుతూనే ఉన్నాడు. కేన్ క్రీజులో ఉన్నంతసేపు టీమిండియాలో టెన్షనే. ఎందుకంటే మ్యాచ్ని తిప్పేయగల బ్యాటర్ అతడు. సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు మరింత వేగంగా ఆడుతూ మ్యాచ్ని గెలిపించే ప్రయత్నం చేశాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 41వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ మొదటి బంతిని ఎదుర్కొన్న విలియమ్సన్ సింగిల్ తీశాడు. ఆ తర్వాత శాన్ట్నర్ కూడా రెండో బంతికి సింగిల్ తీయగా మూడో బంతికి విలియమ్సన్ ఒక్క పరుగు తీశాడు. ఐదో బంతికి మరో సింగిల్ తీసిన శాన్ట్నర్ ఆరో బంతిని విలియమ్సన్కి స్ట్రయికింగ్ ఇచ్చాడు. చివరి బంతిని బౌండరీగా మలచాలని ప్రయత్నించి విలియమ్సన్ ముందుకు వచ్చి ఆడాడు. అయితే బంతి మిస్ అవడంతో వెనక్కి కూడా తిరగకుండా పెవిలియన్కు వెళ్లాడు.
ఆఖరి బంతికి విలియమ్సన్ వికెట్ తీసిన అక్షర్ పటేల్ని తోటి ఆటగాళ్లు అభినందించారు. విరాట్ కోహ్లి నేరుగా వచ్చి అక్షర్ పటేల్ కాళ్లు టచ్ చేశాడు. విలియమ్సన్ని అవుట్ చేసినందుకు థాంక్స్ అంటూ అక్షర్ పాదాలు పట్టుకున్నాడు. అక్షర్ పటేల్ వద్దని వారించినా ఒప్పుకోకుండా పట్టుకున్నాడు. అయితే, ఇదంతా చాలా సరదాగనే జరిగింది. ఫన్నీ అయినప్పటికీ విరాట్ కోహ్లి అక్షర్ కాళ్లు టచ్ చేయడం గొప్ప విషయమే.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రేయాస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలోనే 205 పరుగులకు ఆలౌట్ అయింది. కేన్ విలియమ్సన్ 81 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa