ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే డ్వాక్రా సభ్యులందరికీ స్మార్ట్‌ఫోన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2019, 04:14 PM

అమరావతి: మహిళల ఆత్మగౌరవం కోసమే డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళల పాత్ర కీలకమని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అమరావతిలోని ప్రజావేదికలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని చెప్పారు. త్వరలోనే డ్వాక్రా సంఘాల సభ్యులకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనున్నట్టు సీఎం మరోసారి స్పష్టంచేశారు. భారతదేశానికి కుటుంబ వ్యవస్థ ఓ గొప్ప వరమన్నారు. చాలామంది మహిళల్లో సమర్థ నాయకత్వం ఉందని కొనియాడారు. మానవ సంబంధాలు ముఖ్యమని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలని సూచించారు. 98 లక్షల మంది పేద మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, 35,600 గ్రామ సమాఖ్యలు ఉన్నాయని తెలిపారు. డ్వాక్రా వంటి శక్తిమంతమైన సంఘాలు ఎక్కడా లేవని చెప్పారు. త్వరలోనే మహిళా డ్రైవర్లు వస్తారని.. అది ఎంతో దూరం లేదన్నారు.


భవిష్యత్తులో డ్వాక్రా సంఘాల ద్వారా అనేక కార్యక్రమాలు చేయిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు పసుపు- కుంకుమ కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, కోటి మంది ఆడ బిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తున్నట్టు తెలిపారు. పూర్తిగా వడ్డీలేని రుణాలను వారికి  ఇస్తున్నామని ఈ సందర్భంగా సీఎం వివరించారు.  మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారి ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా వెళ్తాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అన్నివిధాలా సహకరిస్తున్నామని, మాతృమూర్తిని గౌరవించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సామూహక సీమంతాల కార్యక్రమం చేపట్టినట్టు చంద్రబాబు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa