ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ యువనేతను చంపింది స్నేహితుడే

national |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 07:30 PM

హర్యానాలో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త, 23 ఏళ్ల హిమాని నర్వాల్ కేసులో.. తాజాగా పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈనెల 1వ తేదీన రోహ్‌తక్-ఢిల్లీ జాతీయ రహదారిపై రద్దీగా ఉండే సంప్లా బస్టాండ్ సమీపంలో ఒక సూట్‌కేస్ లభించింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అందులో హిమానీ నర్వాల్ మృతదేహం కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఇక ఆ హత్య కేసులో సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడంతో.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగి విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


ఈ కేసులో విచారణ జరుపుతున్న సిట్.. సోమవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఝజ్జర్‌కు చెందిన సచిన్‌గా గుర్తించారు. ఈ నిందితుడు సచిన్‌కు హత్యకు గురైన హిమాని నర్వాల్‌తో పరిచయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఝజ్జర్‌లో సచిన్‌కు మొబైల్ షాప్ ఉందని.. సోషల్ మీడియాలో హిమాని నర్వాల్, సచిన్‌కు ఏడాది క్రితం పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా రోహ్‌తక్‌లోని విజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్న హిమాని నర్వాల్ ఇంటికి సచిన్ తరచుగా వస్తూ ఉండేవాడని.. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27వ తేదీన రాత్రి కూడా వచ్చినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రిషన్ కుమార్ రావు తెలిపారు. రాత్రి హిమాని నర్వాల్, సచిన్ కలిసి అదే ఇంట్లో చేశారని తెలిపారు.


ఆ తర్వాతి రోజు ఒక విషయంపై సచిన్, నర్వాల్‌కు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని.. ఈ క్రమంలోనే ఆమెను హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. హిమాని నర్వాల్ చేతులను దుప్పటితో కట్టేసి.. సెల్‌ఫోన్ ఛార్జర్‌తో ఆమె గొంతు నులిమి చంపేసినట్లు అడిషనల్ డీజీపీ క్రిషన్ కుమార్ రావు పేర్కొన్నారు. ఆ తర్వాత హిమానీ నర్వాల్ మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచి.. ఆమె ఫోన్, ల్యాప్‌టాప్, ఆభరణాలను హిమానీ స్కూటీలోనే తీసుకెళ్లి తన సెల్‌ఫోన్ దుకాణంలో దాచి పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాత మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను ఆటోలో తీసుకెళ్లి సాంప్లా బస్టాండ్ దగ్గర పడేశాడని.. అయితే సచిన్ సూట్‌కేస్ తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.


మరోవైపు.. హిమాని నర్వాల్ మృతదేహాన్ని దహనం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. తమ కుమార్తెకు ఎవరితోనూ సన్నిహిత సంబంధాలు లేవని.. ఆమె హత్యకు ఏదో బలమైన కారణం ఉందని బాధితురాలి తల్లి సవితా నర్వాల్ తీవ్ర అనుమానం వ్యక్తం చేసింది. డబ్బుల కోసమే.. స్నేహితుడు ఎలా చంపుతాడని ఆమె ప్రశ్నించింది. పోలీసుల విచారణపైనా తమకు అనుమానం ఉన్నట్లు ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa