ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హాజరైన కందుల దుర్గేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 04:56 PM

జర్మనీలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పలువురు పెట్టుబడిదారులతో ఇవాళ(బుధవారం) ప్రత్యేకంగా మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. ఏపీ పర్యాటకాభివృద్ధి అవకాశాలు, వనరుల గురించి మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియా ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హాజరుకావడం సంతోషంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు బెర్లిన్ సదస్సు ఉపకరిస్తుందని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశ పర్యాటకానికి ఏపీ ముఖద్వారమని పేర్కొన్నారు. ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ విశాల సముద్రతీరం,అందమైన బీచ్‌లు, ఎత్తైన హిల్ ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని మంత్రి దుర్గేష్ చెప్పారు. సాహస పర్యాటకం, చారిత్రక వారసత్వ సంపద, సుందరమైన తీర ప్రాంత సమ్మేళనంతో కూడిన ఏపీని యూరోపియన్, ప్రపంచ పర్యాటకులు చూడాల్సిన ప్రాంతమని అన్నారు. ఏపీలో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందని, అత్యధిక పర్యాటకులు సందర్శించిన ప్రదేశంగా నిలిచిందని తెలిపారు. ఏపీలో అమరావతి, నాగార్జున కొండ లాంటి బుద్ధిజానికి ప్రతీకగా నిలిచిన అనేక ప్రదేశాలున్నాయని అన్నారు. ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కృషి చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన, సుస్థిర వృద్ధిరేటు, యువతకు ఉపాధి కల్పన, స్థానిక జన సమూహాల భాగస్వామ్యంతో పర్యాటకం అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులపై దృష్టి సారించామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఏపీలో రుషికొండ, రామకృష్ణ, మైపాడు, సూర్యలంక తదితర అందమైన బీచ్‌లున్నాయని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa