ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు రూ.3880 కోట్లతో మరో కొత్త పథకం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 10:47 PM

దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. మరిన్ని పథకాలను అన్నదాతల కోసం ప్రవేశపెడుతున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుందని ఇప్పటికే ప్రధాని మోదీ అనేకసార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్.. పలు నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది.


అన్నదాతల సంక్షేమం కోసం ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పశువుల ఆరోగ్యం కోసం క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం రూ.3880 కోట్లను కేంద్ర కేబినెట్‌ కేటాయించింది. ఈ పథకం కింద పశువులకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు.. తక్కువ ధరకే వాటికి అవసరమైన మందులు అందించేందుకు పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ పథకంలో భాగంగా.. టీకాలు వేయడం, పశువుల ఆరోగ్యంపై నిఘా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పశువులకు వ్యాధులు రాకుండా నివారించడం, నియంత్రణలో సహాయపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ పథకం పశు సంపద ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా రైతులకు కూడా ఉపాధిని సృష్టిస్తుందని తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుందని.. పశువుల వ్యాధుల బారిన పడకుండా, రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చేస్తుందని వెల్లడించాయి.


కేదార్‌నాథ్ రోప్ వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. విరాసత్ బి.. వికాస్ బి పథకం కింద పర్వత్ మాలలో భాగంగా తొలి ప్రాజెక్టుగా కేదార్‌నాథ్ రోప్ వే పథకానికి కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం కల్పించింది. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు మొత్తం 12.9 కిలోమీటర్ల రోప్ వేను నిర్మించనున్నారు. ఈ కేదార్‌నాథ్ రోప్ వే నిర్మాణం కోసం రూ.4081 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో హిమాకుండ్ సాహిబ్ రోప్ వే నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 12.4 కిలోమీటర్ల రోప్ వేకు రూ.2730 కోట్లు మంజూరు చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa