ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో 5, రష్యాలో 3 లక్షల మందికి ఒక ఎంపీ.. మరి మన దేశ పరిస్థితి

national |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 10:48 PM

లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన ప్రస్తుతం జనాభా ప్రాతిపదికనే చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. కానీ దీన్ని అనేక రాష్ట్రాలు అంగీకరించడం లేదు. అలా చేస్తే తమ రాష్ట్రంలో ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని గొడవ చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఎంపీలు చాలు.. కొత్తగా ఆ స్థానాలను పెంచొద్దంటూ మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. కానీ పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. 145 కోట్ల జనాభా కల్గిన భారత దేశంలో కేవలం 543 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని.. ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ అని తెలుస్తోంది. ముఖ్యంగా చైనాలో ప్రతీ 5 లక్షల మందికి ఒక ఎంపీ ఉండగా.. రష్యాలో ప్రతీ 3 లక్షలకు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. కానీ భారత్‌లో మాత్రం 30 లక్షల మంది ప్రజలకు ఒక్క ఎంపీ కూడా లేడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


భారతదేశంలో మొత్తంగా 543 ఎంపీ స్థానాలు ఉండగా.. 145 మంది కోట్ల జనాభా ఉంది. ఈ లెక్కన 10 లక్షల మంది జనాభాకు 0.37 ఎంపీలు మాత్రమే ఉన్నారు. కనీసం 30 లక్లల మందికి ఒక్క ఎంపీ కూడా లేరు. కానీ అదే చైనాలో 142 కోట్ల మంది జనాభా ఉండగా.. 2,977 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అంటే 10 లక్షల మంది జనాభాకు ఇద్దరు ఎంపీలు ఉన్నట్లు. ఇక అమెరికాలో 3 కోట్ల 32 లక్షల మంది ప్రజలు ఉంటే.. 435 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇలా 10 లక్షల మంది జనాభాకు 1.31 ఎంపీలు ఉన్నారు. ఇక ఇండోనేషియాలో 2 కోట్ల 80 లక్షల మంది ప్రజలు ఉండగా.. 580 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇలా ప్రతీ 10 లక్షల మందికి 2.07 మంది ఎంపీలు ఉన్నారు.


భారతదేశ శత్రుదేశమైన పాకిస్థాన్‌లో 2 కోట్ల 48 లక్షల జనాభా ఉండగా.. 336 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇలా ప్రతీ 10 లక్షల మందికి 1.35 ఎంపీలు ఉన్నారు. బ్రెజిల్‌లో 2 కోట్ల 17 లక్షల మంది ప్రజలు ఉండగా.. 513 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతీ 10 లక్షల మందికి 2.36 మంది ఎంపీలు ఉన్నారు. ఇక నైజీరియాలో 2 కోట్ల 23 లక్షల మంది ప్రజలు ఉండగా.. 360 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఇలా ప్రతీ 10 లక్షల మందికి 1.61 ఎంపీలు ఉన్నారు. బంగ్లాదేశ్‌లో కోటి 72 లక్షల జనాభా ఉండగా.. 300 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇలా 10 లక్షల మంది జనాభాకు 1.74 ఎంపీలు ఉన్నారు.


రష్యాలో మొత్తంగా కోటి 43 లక్షల మంది ప్రజలు ఉండగా.. 450 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతీ పది లక్షల మందికి 3.15 ఎంపీలు ఉన్నారు. అంతేకాకుండా మెక్సికోలో కోటి 29 లక్షల మంది ప్రజలు ఉండగా.. 500 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇలా పది లక్షల మందికి 3.88 ఎంపీలు ఉన్నారు. ఒక్క భారత్‌లో మాత్రమే ఎక్కువ మంది జనాభాకు అతి తక్కువ ఎంపీలు ఉన్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ స్థానాలను పెంచాలని చూస్తోంది.


కానీ భారత దేశంలో మొత్తంగా 4,131 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభ్యులు కూడా ఉన్నారు. ఈ లెక్కన ప్రతీ ఒక ఎంపీకి కనీసం 7 నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీని వల్లే దేశంలో పాలన సమర్థవంతంగా అందుతోందని.. అందువల్లే ఎంపీ స్థానాలను పెంచాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa