కొన్ని విషయాలు ఎవరికి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇక డబ్బులకు సంబంధించిన విషయాలను ఎవరికైనా చెప్పేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున అది వేరే వారి చెవిలో పడ్డాయంటే ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఓ 9వ తరగతి చదివే బాలిక.. తమ కుటుంబానికి భూమి అమ్మగా వచ్చిన రూ.80 లక్షల డబ్బుల గురించి తన ఫ్రెండ్కు చెప్పే సమయంలో అక్కడే ఉన్న ఓ పదో తరగతి విద్యార్థి అది విన్నాడు. దాన్ని తన అన్న, ఇతర ఫ్రెండ్స్కు చెప్పాడు. ఎలాగైనా ఆ రూ.80 లక్షలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ బాలికను భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి వారంతా కలిసి ఆమె వద్ద నుంచి రూ.80 లక్షలు విడతలవారీగా లాగేసుకున్నారు. డబ్బులు అయిపోయినా వేధింపులు ఆగకపోవడంతో ఆ బాలిక.. తన టీచర్కు చెప్పడంతో విషయం బయటికి వచ్చింది.
ఉత్తర్ప్రదేశ్ గురుగ్రామ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని.. తన ఫ్రెండ్తో మాట్లాడుతూ తమ కుటుంబం పొలం అమ్మేసిందని.. అందుకు రూ.80 లక్షలు వచ్చినట్లు చెప్పింది. ఆ డబ్బులను తన నానమ్మ ఖాతాలో జమ చేసినట్లు చెప్పింది. అయితే ఆ విషయం కాస్తా 10వ తరగతి విద్యార్థి చెవిలో పడింది. వాటిని ఎలాగైనా కొట్టేయాలని అతడికి అనిపించింది. దీంతో జరిగిన విషయం మొత్తం తన సోదరుడు, ఇతర ఫ్రెండ్స్కు చెప్పాడు. ఆ తర్వాత వారంతా కలిసి ఆ బాలిక నానమ్మ అకౌంట్లో ఉన్న డబ్బును కాజేయాలని ప్రణాళిక రచించారు.
అయితే సుమిత్ కటారియా అనే యువకుడు ఆన్లైన్లో ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఫొటోలను పంపించాలని కోరాడు. దీంతో అతడిని నమ్మిన బాలిక.. ఫోటోలు పంపించింది. వాటిని మార్ఫింగ్ చేసిన సుమిత్ కటారియా.. డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక.. తన నానమ్మకు తెలియకుండా ఆమె అకౌంట్లో ఉన్న డబ్బులు పంపించింది. ఆ తర్వాత కూడా అలాగే సుమిత్ కటారియా డబ్బులు డిమాండ్ చేయడంతో పలుమార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది.
ఇక చివరికి రూ.80 లక్షల డబ్బులు మొత్తం అయిపోయినా.. సుమిత్ కటారియా మాత్రం బాలికను వేధించడం ఆపలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ బాలిక జరిగిన విషయం మొత్తం తన టీచర్కు చెప్పింది. అదంతా విన్న ఆ టీచర్.. బాలికను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం మొత్తం వివరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆ నిందితుల నుంచి మొత్తం రూ.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa