లోక్సభ నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు, ఇతర రాష్ట్రాల్లోని పార్టీల మధ్య గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా దీనిపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విభజన ప్రక్రియ తాజా జనాభా లెక్కల ప్రకారం జరిగితే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వివరించారు. దీన్ని తాము ఏమాత్రం అంగీకరించబోమని వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను తాజా జనాభా ప్రాతిపదికన చేపడాతమని ఇటీవలే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రకటించింది. దీనిని అనేక రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా తమ రాష్ట్రాలు జనాభా పెరుగుదల నియంత్రణ చర్యలు చేపట్టాయని.. ఫలితంగా పెద్ద ఎత్తున జనాభా తగ్గిందని చెబుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఇందుకు అంగీకరించకుండా.. కొత్తగా చేయబోయే జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తామని చెబుతోంది. అయితే తాజాగా దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. అందులో భాగంగానే 1971 జనాభా లెక్కల ప్రకారమే విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈక్రమంలోనే ఇదే విషయంపై తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ స్పందించారు. నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పుకొచ్చారు. ఈ విభజన ప్రక్రియ తాజాగా జనాభా లెక్కల ఆధారంగా ఉంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం విపరీతంగా తగ్గే అవకాశం ఉందని వివరించారు. దీన్ని ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. గత 50 సంవత్సరాలుగా తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయని గుర్తు చేశారు.
ఈక్రమంలోనే ప్రస్తుతం జనాభా తగ్గిందని.. కానీ దీన్ని ఆధారంగా చేసుకుని నియోజక వర్గాలను విభజించడం సరికాదని తెలిపారు. ఒకరి గెలుపు కోసం మరొకరిని శిక్షించడం అన్యాయం అంటూ విజయ్ వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని నియోజక వర్గాల సంఖ్య తగ్గినా.. ఉత్తర ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య పెరిగినా తాము సహించబోమని వెల్లడించారు. ఈ సమస్యపై అన్ని పార్టీలతో కలిసి పోరాడాతమని చెప్పారు.
ప్రజా ప్రతినిధుల కొరత సాధారణ ప్రజలకు సమస్యే కాదని.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నాణ్యమైన విద్య, వైద్యం, రోడ్లు వంటివి సరిగ్గా లేకనే బాధ పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముందుగా ఈ సమస్యలపై దృష్టి సారించాలని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa