అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంపై 2021లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అయితే తాజాగా ఈ దాడులకు పాల్పడిన సూత్రధారిని పట్టుకున్నట్లు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ సాయం వల్లే ఈ నిందితుడిని అరెస్ట్ చేయగలిగామని కూడా వివరించారు. అంతేకాకుండా పాకిస్థాన్కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
2021వ సంవత్సరం ఆగస్టు నెలలో అఫ్గానిస్థాన్లో పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. విపరీతమైన ఆంక్షలు విధిస్తూ.. సాధారణ ప్రజలకు నరకం చూపించారు. అది తట్టుకోలేక అనేక మంది ప్రజలు ప్రాణ భయంతో పారిపోయే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కంచెలు దాటి, విమానాలను పట్టుకుని వేలాడుతూ ఇతర దేశాలకు వెళ్లేందుకు యత్నించారు. ఇలా చేస్తూనే అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు మాత్రం దేశం దాటి వెళ్లిపోయారు. ఈ విషయం గుర్తించిన ఉగ్రవాదులు ఈ సమయాన్నే అనువుగా తీసుకుని బాంబు దాడులకు పాల్పడ్డారు.
ముఖ్యంగా విమానాశ్రయాల వద్ద ఎక్కువగా జనాలు ఉన్నట్లు గుర్తించి వాటినే లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేశారు. కాబూల్ విమానాశ్రయం వెలుపల, అబే గేటులోంచి లోపలికి వెళ్లేందుకు జనం భారీగా గుమిగూడగా అక్కడే ఓ బాంబును పేల్చారు ఉగ్రవాదులు. ఆ తర్వాత కాసేపటికే అక్కడికి సమీపంలోని మరోచోట పేలుడు సంభవించింది. అయితే ఈ బాంబు పేలుళ్లలో మొత్తంగా 170 మందికి అఫ్గానిస్థాన్ పౌరులు చనిపోగా.. 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి అమెరికా ఈ దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా ఈ దాడికి ప్రణాళిక సిద్ధం చేసిన ప్రధాన సూత్రధారిని పట్టుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఆ దాడి దేశ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన క్షణం అంటూనే.. మూడున్నరేళ్ల కింద జరిగిన ఈ దాడిలో 13 మంది యూఎస్ సైనికులు చనిపోయారని గుర్తు చేశారు. ఆ దారుణానికి ఒడిగట్టిన టెర్రరిస్టును అదుపులోకి తీసుకున్నామని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అతడితి త్వరలోనే కఠిన శిక్ష అమలయ్యేలా చేస్తామన్నారు. అయితే ఈ నిందితుడి అరెస్టుకు పాకిస్థాన్ సాయం చేసిందని వివరించారు. ఈక్రమంలోనే మీడియా ముఖంగా పాకిస్థాన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అమెరికా అరెస్టు చేసిన ఈ ఉగ్రవాది పేరు మహమ్మద్ షరీఫుల్లా అని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa