ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామస్థులు గుర్తుతెలియని వ్యాధితో వణికిపోతున్నారు. ఇప్పటివరకు ఆ వ్యాధితో గత నెల రోజుల కాలంలోనే ఆ గ్రామంలో 13 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సుక్మా జిల్లాలోని ధనికోర్తా గ్రామంలో ఈ వింత వ్యాధి ప్రబలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంతుచిక్కని వ్యాధితో ఒకరి తర్వాత ఒకరు ఇలా నెల రోజుల్లోనే 13 ప్రాణాలు పోవడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళలో పడ్డారు. ఇక ఆ విషయం తెలియగానే ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ధనికోర్తా గ్రామానికి మెడికల్ సిబ్బందిని పంపించి.. గ్రామస్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు ఆ మిస్టరీ వ్యాధి ఏంటా అని ఆరా తీస్తున్నారు.
ధనికోర్తా గ్రామంలో వరుసగా చనిపోతున్న వారికి కొన్ని లక్షణాలు ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. బాధితులు చనిపోయే ముందు వరకు కూడా ఛాతీ నొప్పి, నాన్స్టాప్గా దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లు చెప్పారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ ధనికోర్తా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఈ వ్యాధి బాధితులు ఉన్నారని, వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొంటుండటం మరింత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఇక ఈ అంతుచిక్కని వ్యాధి గురించి వస్తున్న వార్తలపై సుక్మా జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ మీడియాకు వెల్లడించారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అయితే ఆ ఐదుగురిలో ముగ్గురు వృద్ధాప్య సమస్యలతో చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరి మృతికి గల కారణాలను ఇంకా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం.. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణంగా ఈ వింత వ్యాధితో గ్రామస్థులు చనిపోతున్నట్లు అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మహువా పంట సేకరణ కోసం గ్రామస్థులు రోజు మొత్తం అటవీ ప్రాంతంలోనే ఉంటారని.. అందువల్ల వారు డీహైడ్రేషన్కు గురై, అనారోగ్యం బారిన పడుతున్నారని డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa