ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రమశిక్షణ కమిటీ వద్ద హాజరుకావాలంటూ చదలవాడకు సీఎం ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 12:23 PM

కూటమి ప్రభుత్వం, టీడీపీ లైన్ దాటిన నేతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారు. ఎంతటి వ్యక్తి అయినా సరే పార్టీకి, ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలని హెచ్చరిస్తున్నారు. శృతిమించి వ్యవహరించే వారిని తన, మన అనే బేధాలు లేకుండా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయంలో చదలవాడ చేసిన హంగామాపై మండిపడ్డారు. అధికారుల పట్ల ఎమ్మెల్యే చదలవాడ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ఘటనపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని చదలవాడను టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది. గురువారం రాత్రి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే చదలవాడ అక్కడే పడుకుని నిరసన తెలిపారు. తాను చెప్పిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ హంగామా సృష్టించారు. ఎక్సైజ్ కమిషనర్‌ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వారిని తొలగించడం కుదరదని చెప్పడంతో అక్కడే నిరసనకు దిగి పార్టీ లైన్ దాటారు. దీనిపై శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం చంద్రబాబుకు పార్టీ వర్గాలు సమాచారం అందించాయి. మీడియాలో వచ్చిన కథనాలను సీఎంకు చూపించారు. దీంతో ఎమ్మెల్యే చదలవాడ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వివరణ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇటీవల ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పైనా చంద్రబాబు ఆగ్రహించారు. మహిళపై దాడి సహా నియోజకవర్గంలో పలువురిని వేధించారంటూ వచ్చిన ఆరోపణలపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు వివరణ ఇవ్వాలని, టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని హుకుం జారీ చేశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, పార్టీ లైన్ దాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకోవాలే తప్ప, వివాదాలు సృష్టించవద్దని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa