ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ మళ్లీ ఓడిపోతేనే మంచిది.. ఆ విషయంలో అశ్విన్ సలహా

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 07:59 PM

టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అశ్విన్ ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంటాడు. గ్రౌండ్‌లో ఉన్నప్పుడు తన స్పిన్ మాయాజాలంతో, గ్రౌండ్ బయట ఉన్నప్పుడు సలహాలతో టీమిండియాకు తన సపోర్ట్ అందిస్తూనే ఉన్నాడు. సెమీ ఫైనల్స్‌లో కూడా పవర్ ప్లేలో కొత్త బంతితో వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వండి.. ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపిస్తాడు అని సలహా ఇచ్చాడు. సరిగ్గా అలాగే ట్రావిస్ హెడ్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్స్‌కు ముందు రోహిత్ శర్మకు అశ్విన్ మరో సలహా ఇచ్చాడు.


ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కసారి కూడా రోహిత్ శర్మ టాస్ గెలవలేదు. వరుసగా 14 వన్డేల్లో టీమిండియా టాస్ కోల్పోయింది. న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్స్ మ్యాచ్‌లోనూ రోహిత్ టాస్ ఓడిపోతేనే మంచిదని రవిచంద్రన్ అశ్విన్ సలహా ఇచ్చాడు. అలాంటి సందర్భంలోనే కివీస్ జట్టును ఇరకాటంలో పెట్టొచ్చని అభిప్రాయపడ్డాడు.


"భారత్ ఈసారి కూడా టాస్ గెలవకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఏది ఎంచుకోవాలో అనేది కివీస్‌కే వదిలేయాలి. అప్పుడు భారత్‌ క్లిష్ట పరిస్థితుల్లో పడే అవకాశం ఉండదు. భారత్ ఇప్పటి వరకు ఈ ట్రోఫీలో టాస్ ఓడిపోయినప్పుడు ఛేజింగ్ అయినా.. ఫస్ట్ బ్యాటింగ్ అయినా విజయం సాధించింది. ఈసారి కూడా టీమిండియా విజయం సాధిస్తుందని అనుకుంటున్నా. న్యూజిలాండ్ బౌలర్లు గతంలో టీమిండియాను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా వారు బలంగానే ఉన్నారు" అని అశ్విన్ తన అభిప్రాయం తెలిపాడు.


న్యూజిలాండ్ జట్టులో కేన్ విలియమ్సన్ కీలక ఆటగాడని, అతన్ని ఇబ్బంది పెట్టే బౌలర్ రవీంద్ర జడేజానే అంటూ అశ్విన్ అభిప్రాయం వెలిబుచ్చాడు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్-రవీంద్ర జడేజా మధ్యే గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నాడు. విలియమ్సన్ లెగ్ స్టంప్ అవతలి వెళ్లేందుకు ఎక్కువ ప్రయత్నిస్తాడు, ఇంకొన్ని సార్లు బౌలర్ పైగా షాట్స్ బాదుతాడు. విలియమ్సన్‌ను ఇరకాటంలో పెట్టాలంటే జడ్డూనే కరెక్ట్.. వీరిద్దరి మధ్య చాలా ఆసక్తికర పోరు సాగుతుందని చెప్పాడు.


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు గ్రూప్ ఏ నుంచి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. టీమిండియా నాలుగు విజయాలతో ఫైనల్‌కు చేరుకోగా, కివీస్ మూడు విజయాలు, ఒక ఓటమితో ఫైనల్‌లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ ఓడిన ఏకైక మ్యాచ్ కూడా గ్రూప్ స్టేజ్‌లో భారత్‌పైనే. దాంతో ఫైనల్‌లో టీమిండియా ఫేవరెట్‌గా దిగుతోంది.


దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో మ్యాచ్ లైవ్ ప్రసారం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa