ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అక్కడ ఉచిత బస్సు ప్రయాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 10:15 PM

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం మొదలైపోయింది. అది కూడా ఎలక్ట్రిక్ బస్సులలో.. అదేంటీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇంకా ప్రభుత్వం ప్రారంభించనే లేదు కదా అని ఆశ్చర్యపోకండి. ఇది వేరే.. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రెండు ఎలక్ట్రిక్ బస్సులను నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ రెండు ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చింది. ఈ రెండు ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణం పూర్తిగా ఉచితం. ఒక బస్సును మంగళగిరి ఎయిమ్స్‌కు, మరో బస్సులు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నడపనున్నారు.


మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ ఆస్పత్రి, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీటిని ఏర్పాటు చేసినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.2.4 కోట్ల విలువైన రెండు ఒలెక్ట్రా బస్సులను ఉచితంగా అందించిందని నారా లోకేష్ వివరించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులలో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్ వరకూ , మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని నారా లోకేష్ తెలిపారు.


ఎయిమ్స్‌కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉంటుంది.18 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ బస్సు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే150 కి.మీ. వరకు ప్రయాణించగలదు.


గుంటూరు, మంగళగిరికి ఎలక్ట్రిక్ బస్సులు


మరోవైపు గుంటూరు, మంగళగిరికి ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించే ఆలోచనలో కేంద్రం ఉంది, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి పట్టణానికి 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు పెమ్మసాని తెలిపారు. అందులో భాగంగానే గుంటూరు, మంగళగిరికి కూడా ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించే అవకాశం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్‌ను కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగానే ఈ వివరాలను వెల్లడించారు.


పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణహిత రవాణా సౌకర్యాలను కల్పించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని.. ఈ క్రమంలోనే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని వివరించారు. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తాయన్న ఆయన.. నిర్వహణ లోటు కింద కిలోమీటర్‌కు 25 రూపాయలను కేంద్రం భరించే ఆలోచనలో ఉందన్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించాలంటే ప్రత్యేక సదుపాయాలు కావాలన్న కేంద్ర మంత్రి.. గుంటూరు ఆర్టీసీ బస్టాండులో ఉన్న సదుపాయాలను ఆదివారం పరిశీలించారు. గుంటూరు బస్టాండ్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. బస్టాండ్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం స్థలం పోగా.. మిగతా స్థలాన్ని లీజుకు ఇచ్చే ఆలోచన చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com