ఈ ఏడాది దేశం ఆర్ధిక మాంద్యం ముప్పును ఎదుర్కోబోతుందని జరుగుతోన్న ప్రచారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు అలాంటివి అంచనా వేయడం ఇష్టముండదు’ అని వ్యాఖ్యానించారు. ‘‘పరివర్తనకు సమయం పడుతుంది.. ఎందుకంటే మనం చేస్తున్నది చాలా పెద్ద టాస్క్.. మనం అమెరికాకు సంపదను తిరిగి తీసుకువస్తున్నాం’’ అని అన్నారు. ‘‘ఏప్రిల్ 2 నుంచి అన్నీ పరస్పర సుంకాలు విధింపులే... మనపై ఎంత సుంకాలు విధిస్తే.. మనమూ వారి నుంచి అంతే వసూలు చేస్తాం’ అని పునరుద్ఘాటించారు. కానీ, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్స్ మాత్రం మాంద్యం అవకాశాలను కొట్టిపారేయడం గమనార్హం.
ఆదివారం ఆయన మీట్ ది ప్రెస్లో మాట్లాడుతూ అమెరికన్లు ఆర్థిక మాంద్యానికి సిద్ధంగా ఉండాలా అని అడిగిన ప్రశ్నకు.. ‘ఖచ్చితంగా కాదు’ అని సమాధానం ఇచ్చారు. కెనడా, మెక్సికో, చైనా, ఇతర దేశాలపై ట్రంప్ పదే పదే సుంకాల బెదిరింపులు అమెరికా మార్కెట్లను గందరగోళంలో పడేశాయి. ఇది ఎక్కడకు దారితీస్తుందోనని అనిశ్చిత కస్టమర్లలో నెలకుంది. గతేడాది నవంబరులో ఎన్నికల తర్వాత మొదటిసారి అమెరికా మార్కెట్లు గతవారం కుప్పకూలాయి. ఇప్పటికే ఏళ్ల తరబడి ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే.. తాజాగా ట్రంప్ ప్రతీకార సుంకాలతో అధిక ధరలు ముప్పు పొంచి ఉంది. దీంతో మదుపర్లకు విశ్వాసం సన్నగిల్లింది.
అలాగే, ట్రంప్ సలహాదారు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ తీసుకున్న పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపులు మరింత ఆందోళనను పెంచుతున్నాయి. దీనికితోడు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో నిజమైన జీడీపీ వృద్ధి 2.4 శాతంగా ఉంటుందని అమెరికా ఫెడరల్ బ్యాంకు అంచనాల వంటి మిశ్రమ సంకేతాలు మార్కెట్ ఒడిదొడుకులకు కారణమయ్యాయి. కోవిడ్-19 తర్వాత జీడీపీ ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి.
కాగా, భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ అనేకసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీని టారిఫ్ కింగ్గా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు.. తమ వస్తువులపై భారీగా పన్నులు విధిస్తోందని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 2న భారత్, చైనాలపై విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోవైపు, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను తగ్గించడానికి భారత్ సిద్ధమైంది. దీనిపై కూడా ట్రంప్ స్పందిస్తూ.. అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న విషయాన్ని తాను బహిరంగంగా ప్రకటన చేయడం వల్లే.. భారత్ ఆందోళన చెంది సుంకాలను తగ్గించడానికి ఒప్పుకుందని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతోనే సుంకాలు తగ్గించినట్టు స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa