అన్లిమిటెడ్ డేటా.. దిగ్గజ టెలికాం కంపెనీలు ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ వ్యూహం ఫలించిందనే చెప్పొచ్చు. అప్పటివరకు చిన్న మొత్తాల్లో నగదుతో రీఛార్జులు చేసుకునే వారు కాస్త.. వందల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మొదట్లో రీఛార్జి అంటే ఒకేసారి రూ. 50, రూ. 100 ఇలా అవసరం ఉన్నంత వరకు పెట్టి రీఛార్జ్ చేసుకునేవారు. ఇది కూడా ఎక్కువే అనుకున్నవారు అవసరం ఉన్నప్పుడు రూ. 10, రూ. 20 స్క్రాచ్ కార్డులు తీసుకొని రీఛార్జ్ చేసుకునేవారు. ఇక డేటా ఛార్జీలు కూడా అప్పట్లో తక్కువలో ఉండేవి. రూ. 11, రూ. 22 ఇలా అవసరం ఉన్నంతలో కొనుగోలు చేసేవారు. కానీ రిలయన్స్ జియో ఎంట్రీతో పరిస్థితి మారిపోయిందన్న సంగతి తెలిసిందే. అన్లిమిటెడ్ కాలింగ్, డేటా పేరుతో సరికొత్త విప్లవం సృష్టించింది. తొలుత చాలా తక్కువ ధరల్లో ఇంత మొత్తంలో రీఛార్జి చేసుకుంటే.. అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్, డేటా ఇలా ఆఫర్లు ప్రవేశపెట్టింది. దీంతో చాలా మంది జియోకు మారారు. తమ కస్టమర్లు తగ్గుతారన్న భయంతో.. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో నడిచాయి.
అయితే కస్టమర్లకు తర్వాతే అర్థమైంది. ఇందులో ఇరుక్కుపోయామని. క్రమక్రమంగా టారిఫ్స్ పెంచుతూ వెళ్లాయి. ఒకప్పుడు పెట్టిన మొత్తానికి 3 నెలలకు వచ్చేది.. ఇప్పుడు నెల కూడా రావట్లేదు. తక్కువ మొత్తంలో చేసుకునే రీఛార్జుల్ని క్రమంగా ఎత్తేసింది. ఒకప్పుడు డైలీ 1జీబీ డేటా ప్లాన్లు ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు ఈ డేటాను పెంచి.. రేట్లను కూడా పెంచేసింది. ఈ క్రమంలోనే డేటా పెద్దగా అవసరం లేని వారికి కూడా ఈ రీఛార్జ్ చేసుకోవాలంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసి వాయిస్, ఎస్ఎంఎస్లతో పాటుగా డేటా ప్లాన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చేది.
అయితే ఇటీవల ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో టెలికాం కంపెనీలు దిగొచ్చాయి. డేటాతో పనిలేకుండా.. కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్లు తీసుకురావాలన్న ఆదేశాలకు అనుగుణంగా టారిఫ్స్ సవరిస్తూ కొత్త ప్లాన్స్ తెచ్చాయి.
>> ఇది రిలయన్స్ జియోలో ప్రస్తుతం రూ. 448 కనీస ధరతో అందుబాటులో ఉంది. ఇక్కడ ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1000 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. ఇదే రూ. 1748 తో రీఛార్జి చేసుకుంటే.. అన్లిమిటెడ్ వాయిస్ సహా 3600 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. ఇక్కడ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది.
>> భారతీ ఎయిర్టెల్లో చూస్తే రూ. 469 ప్రారంభ ధరతో వాయిస్ ఓన్లీ ప్లాన్స్ ఉండగా.. ఇక్కడ 84 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ సహా 900 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. రూ. 1849 తో రీఛార్జి చేసుకుంటే.. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్ లు వస్తాయి. ఇక్కడ వ్యాలిడిటీ 365 రోజులు.
>> ఇదే వొడాఫోన్ ఐడియాలో చూస్తే రూ. 470 ప్లాన్తో రీఛార్జి చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్ లు వస్తాయి. ఇదే రూ. 1849తో 365 రోజులకు అపరిమిత వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్లు పొందొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa