ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 08:11 PM

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో శాంతిభద్రతల అంశంపై ఆయన ప్రసంగించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం శక్తి యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ఆడబిడ్డల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని, ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు.రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వినియోగం పెరగడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఈ సమస్యను అరికట్టడానికి "ఈగల్" వ్యవస్థను ప్రవేశపెట్టామని, గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.సోషల్ మీడియాలో అసభ్యకర రాతలు రాసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. గత పాలకులు రాజకీయ లబ్ధి కోసం దిగజారి, మహిళలపై వ్యక్తిగత దూషణలు చేశారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని, తీవ్రవాదం అరికట్టడానికి, మత సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.పేదల భూములను కాపాడటానికి ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టాన్ని తీసుకువస్తోందని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు భూ మాఫియాకు పాల్పడ్డారని, ప్రభుత్వ, పేదల భూములను కొట్టేశారని ఆయన ఆరోపించారు. నేరాలను అరికట్టడానికి రాత్రి సమయంలో డ్రోన్ పెట్రోలింగ్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 26 సైబర్ సెక్యూరిటీ స్టేషన్లను నెలకొల్పుతున్నామని ఆయన అన్నారు.వివేకా హత్య కేసును గుర్తు చేస్తూ, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారిని ఉపేక్షించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు. నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ ఎమ్మెల్యేల బాధ్యత అని, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తామని ఆయన అన్నారు.మహిళా భద్రతకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్న మహిళలు ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం దిశా యాప్ పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. మహిళల భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa