నేపాల్లో 2008 వరకు రాచరికపు పాలన అమల్లో ఉండేది. 2008లో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర యుద్ధం కారణంగా రాజు గద్దె దిగిపోయి.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. పాలన చేపట్టింది. ఇది జరిగి ఇప్పటికే 17 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. అయితే ఇప్పుడు నేపాల్లో కొత్త డిమాండ్ పుట్టుకొస్తోంది. తిరిగి తమ దేశంలో రాజు పాలన కావాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాచరికానికి మద్దతు ఇచ్చే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ తాజాగా ఓ భారీ ర్యాలీని చేపట్టింది. ఈ ర్యాలీలో నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫోటోలను ప్రదర్శించారు. జ్ఞానేంద్ర షాతోపాటు అదే ర్యాలీలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను కూడా ప్రదర్శనకు ఉంచడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.
రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చేపట్టిన ఈ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటోలతో నేపాల్లో ఆయన ట్రెండ్ అవుతున్నారు. నేపాల్లో రాచరిక పాలనకు మద్దతుగా ఆ దేశంలో జరుగుతున్న ర్యాలీల్లో యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు కనిపిస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేపాల్లో రాచరికానికి యోగి ఆదిత్యనాథ్ బలమైన మద్దతుదారుగా ఉన్నారు. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగి ఆదిత్యనాథ్కు మంచి సంబంధాలు ఉండడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ఇటీవల జనవరిలో జ్ఞానేంద్ర షా భారత్లో పర్యటించగా.. ఆ సమయంలో ఆయన యోగి ఆదిత్యనాథ్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నేపథ్యంలోనే నేపాల్లో రాచరిక పాలనను మళ్లీ తీసుకురావాలని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ గత కొంత కాలంగా గట్టిగా డిమాండ్ చేస్తోంది. మాజీ రాజు జ్ఞానేంద్ర షాకు మద్దతుగా ఆ పార్టీ ర్యాలీ నిర్వహించింది. నేపాల్లో రాజు పాలనను పునరుద్ధరించాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర షా ఫొటోతోపాటు యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు ర్యాలీలో కనిపించడంపై అక్కడ తీవ్ర దుమారం రేగింది. ఇతర దేశాలకు చెందిన వారి ఫోటోలను ప్రదర్శించినందుకు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్పీపీ పార్టీ ప్రతినిధి ఒకరు క్లారిటీ ఇచ్చారు.
తాము చేస్తున్న ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చేందుకు నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ వర్గం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ సూచన మేరకే ఆ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు ప్రదర్శించినట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను బిష్ణు రిమాల్ ఖండించారు. మరోవైపు.. ఇటీవల నేపాల్ రాజధాని కాఠ్మాండూ, పోఖార సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రాచరిక పాలనను పునరుద్ధరించాలని ర్యాలీలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో జరిగిన తీవ్రమైన ప్రజా ఉద్యమం కారణంగా నేపాల్లో రాజు పాలన అంతమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa