ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలోని భారతీయులకు బిగ్ అలర్ట్.. అడ్వైజరీ జారీ చేసిన భారత ఎంబసీ

international |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 07:56 PM

vఅమెరికాలోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. అమెరికాలో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ పేరుతో ఫేక్ కాల్స్ వస్తున్నాయని అలర్ట్ చేసింది. అలాంటి నకిలీ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎవరైనా ఫోన్ చేసి.. ఇండియన్ ఎంబసీ నుంచి కాల్స్ చేస్తున్నట్లు చెప్పి సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని సూచించింది. వ్యక్తిగత సమాచారం, క్రెడిట్‌ కార్డు వివరాలు అడిగితే వెల్లడించవద్దని పేర్కొంది. అమెరికాలో ఉన్న భారతీయులను మోసం చేసి.. వారి నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఇలాంటి నకిలీ కాల్స్ చేస్తారని వెల్లడించింది.


పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్ ఫారమ్‌, వీసాలో తప్పులు ఉన్నాయని చెబుతూ ఎవరైనా ఫోన్లు చేస్తే.. వారు సైబర్‌ నేరగాళ్లు అని గుర్తించాలని.. అలాంటి వాళ్లు ప్రజలను మోసగించే అవకాశం ఉందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. అయితే ఇలా పాస్‌పోర్టు, వీసా, ఇమ్మిగ్రేషన్ పత్రాల్లో ఉన్న తప్పులను సవరించడానికి డబ్బు చెల్లించాలని పేర్కొంటూ కొందరు సైబర్‌ నేరగాళ్లు భారతీయుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది.


ఇలాంటి తప్పులు సవరించుకోకపోతే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వారిని తిరిగి భారత్‌కు పంపించివేస్తామని.. లేకపోతే జైలు శిక్ష విధిస్తామని సదరు సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. అలాంటి మోసపూరిత కాల్స్‌ వస్తే వాటిని గుర్తించి.. భయపడకుండా తమకు సమాచారం అందించాలని భారత రాయబార కార్యాలయం అమెరికాలోని భారతీయ ప్రజలకు సూచించింది.


అయితే ఈ అడ్వైజరీ జారీ చేయడానికి.. ఒక కారణం ఉంది. అమెరికాలోని భారతీయులతో పాటు, వీసా దరఖాస్తుదారులకు ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందుకే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులు ఎవరూ.. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కోరుతూ ఫోన్‌ కాల్స్‌ చేయరని వెల్లడించింది. కేవలం అధికారిక ఈ-మెయిల్ @mea.gov.in ద్వారా మాత్రమే సంప్రదిస్తారని స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. ఇక ఎవరికైనా ఫేక్ కాల్స్‌ వస్తే cons1.washington@mea.gov.in లేదా cpers.washington@mea.gov.in ద్వారా అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com