ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ మైదానంలోకి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 10:34 PM

ఐపీఎల్ 2025 సరిగ్గా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు.. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోల్‌కతా వేదికగా జరగనుంది. అయితే ఆర్సీబీ అంటేనే గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌లో తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీకే ఆడుతున్న విరాట్.. తాజా సీజన్‌ కోసం జట్టుతో చేరాడు.


ఐపీఎల్‌ 2025 ప్రారంభానికి వారం ముందు కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఈ ప్లేయర్.. ఐపీఎల్ 18వ సీజన్‌కు సిద్ధమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత.. సుమారు వారం పాటు కుటుంబంతో గడిపిన కోహ్లీ.. మళ్లీ సాధన మొదలుపెట్టనున్నాడు.


ఈ మేరకు విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ జట్టుతో కలిసినట్లుగా ఉన్న ఫొటోలను ఆ జట్టు మేనేజ్‌మెంట్ పంచుకుంది. తాజాగా కోహ్లీ జట్టులో చేరిన వీడియోను కూడా పంచుకుంది. ‘నంబర్‌ 18.. రెడీ ఫర్ సీజన్‌ 18’ అని కోహ్లీ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.


కాగా విరాట్ కోహ్లీ.. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌ తరఫున 5 మ్యాచ్‌ల్లో 54.50 సగటుతో 218 పరుగులు స్కోరు చేశాడు. పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 84 రన్స్ చేశాడు. మొత్తంగా భారత జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మరి ఐపీఎల్ 2025 సీజన్‌లో కోహ్లీ పరుగుల వరద పారిస్తాడా..! ఈ విషయం తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. మార్చి 22న కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. కోహ్లీ జెర్సీ నంబర్ 18 కాగా.. ఐపీఎల్ తాజా సీజన్‌ కూడా 18వదే కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com