అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ మహోత్సవం అమరావతి రాజధానిలో కనులపండుగగా జరిగింది. రాజధాని పరిధి వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో తొలిసారిగా శ్రీనివాసుడి కల్యాణాన్ని శనివారం సాయంత్రం టీటీడీ వైభవోపేతంగా నిర్వహించింది. విద్యుత్ కాంతుల ధగధగలతో వెలుగులీనుతున్న ప్రాంగణంలో కల్యాణ మహోత్సవాన్ని చూస్తూ భక్తజన సందోహం పులకరించిపోయింది. అన్నమయ్య సంకీర్తనలు, వేద మంత్రోచ్ఛరణలతో రాజధాని ఆధ్యాత్మిక నగరిని తలపించింది. కల్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు సంప్రదాయబద్ధంగా పట్టు పంచె ధరించి సతీ సమేతంగా హాజరయ్యారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ కంటే 17నిమిషాలు ముందుగానే, సాయంత్రం 5:43 గంటలకే వెంకటపాలెంలోని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ను మంత్రులు, టీటీడీ సిబ్బందితో కలిసి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు, గవర్నర్ తిరునామధారణ చేయించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ ముఖ్యమంత్రి దంపతులు ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు పట్టువస్త్రాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. పెద్ద జీయర్ స్వామి, చిన జీయర్ స్వామి, అహోబిల మఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, శివస్వామి తదితరులు హాజరయ్యారు. పెద్ద జీయర్ స్వామి ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa