యూరప్లోని ఉత్తర మెసిడోనియాలోని ఓ నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తంగా 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం గుర్తించిన ప్రజలు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఓవైపు మంటలు, మరోవైపు తొక్కిసలటాతో 51 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని నేరుగా అక్కడి అంతర్గత మంత్రిత్వ శాఖే వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
నార్త్ మెసిడోనియా రాజధాని స్కోప్జేకు దాదాపుగా 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొకాని అనే పట్టణంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా పల్స్ క్లబ్లో శనివారం రోజు రాత్రి జరిగిన కాన్సర్ట్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. ఇందులో ఎక్కువ శాంతి మంది యువకులే కాగా.. సంగీత కచేరీని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇంకా కార్యక్రమం కొనసాగుతుండగా.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం గుర్తించిన ప్రజలంతా ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు.
ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగింది. మరోవైపు మంటలు అతి త్వరగా పైకప్పుకు అంటుకోగా.. ఉవ్వెత్తున మంటలు ఎగిశాయి. అలా 51 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్సు సిబ్బందికి ఫోన్లు చేయగా.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓవైపు అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పుతుండగా.. మరోవైపు పోలీసులు, అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రులను బయటకు తీసుకు వచ్చారు.
అంబులెన్సుల ద్వారా వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఆపై మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఇతర ఆస్పత్రుల్లో చేర్చారు. అయితే మంటలు ఎక్కువ కావడంతో.. కొన్ని గంటల పాటు శ్రమించగా ఆరిపోయినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే అసలు అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం.. ఈ కార్యక్రమంలో మండే స్వభావం కల్గిన వస్తువులను వాడడమేనని అధికారులు వివరిస్తున్నారు. దాని వల్లే సీలింగ్కు నిప్పు అంటుకుందని చెబుతున్నారు.
నైట్ క్లబ్లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంపై ఆ దేశ ప్రధా హ్రిస్టిజన్ మికోస్క్ స్పందించారు. విషాధ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూనే.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. ఎక్కువ మంది యువకులే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa