ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యొమెన్‌లోని హూతీలపై అమెరికా భీకర దాడి.. 31 మంది మృతి, 101 మందికి గాయాలు

international |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 07:53 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. యొమెన్‌లోని హూతీలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది. ముఖ్యంగా ఉత్తర యెమెన్‌లోని హూతీ స్థావరాలపై అమెరికా జరిపిన ఎయిర్ స్ట్రైక్స్‌లో మరణించిన వారి సంఖ్య 31కి పెరిగింది. అలాగే ఈ దాడుల్లో కనీసం 101 మంది గాయపడ్డారని అల్ జజీరా తన కథనంలో పేర్కొంది. యెమెన్ అంతటా అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.


యెమెన్ రాజధాని సనా, హూతీల బలమైన కోట అయిన ఉత్తర ప్రావిన్స్ సాదా, అలాగే హూతీ నియంత్రణలో ఉన్న ఇతర యెమెన్ ప్రావిన్సులతో సహా యెమెన్‌లోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రాణ నష్టం సంభవించినట్లు అల్ జజీరా తన కథనంలో నివేదించిందింది. యెమెన్‌పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ శనివారం సాయంత్రం ప్రారంభం అయ్యాయి. సైనిక దాడులు క్రమంగా ఉత్తర సనాలోని అల్-జరాఫ్ నివాస ప్రాంతాన్ని తాకాయి. ఆ తర్వాత తూర్పు సనాలోని షోయాబ్ నివాస ప్రాంతంపై అనేక బాంబు దాడులు జరిగాయి. ఈ విషయాన్ని హౌతీల ఆధీనంలోని అల్-మసిరా టీవీ నివేదించింది.


స్థానికుల ప్రకారం సన్నాలో జరిగిన దాడులు అల్-జరాఫ్ పరిసరాల్లోని హూతీ నియంత్రణలో ఉన్న రాష్ట్ర టెలివిజన్ స్టేషన్ సమీపంలోని మందుగుండు సామాగ్రి, రాకెట్ డిపోలే లక్ష్యంగా సాగాయి. వైమానిక దాడుల తర్వాత పొరుగు ప్రాంతం నుంచి తెల్లటి పొగ పైకి లేచినట్లు స్థానికులు తెలిపారు. అలాగే వరుస బాంబు పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హూతీ ఉగ్ర సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన విషయం తెలిసిందే. హూతీ స్థావరాలపై అమెరికా సైన్యం చేపడుతున్న మొదటి సైనిక చర్య ఇదే.


అమెరికా నౌకలు, విమానాలపై హూతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


హూతీల సమయం ఆసన్నమైందని, దాడులు వెంటనే ఆపేయాలని, లేకపోతే ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్ర శక్తీ ఆపలేదని అన్నారు. హూతీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. వారి చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com