పాకిస్థాన్లో ఉంటూ జమ్మూకశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్-ఏ-తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబు ఖతల్ హతమయ్యాడు. శనివారం రాత్రి పాకిస్థాన్లోనే అతడు హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరపగా.. అబు ఖతల్ సహా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వీరితో పాటే ఉన్న ఇంకో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన గార్డుతో కలిసి జీలం ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అబు ఖతల్పై 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో అబు ఖతల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో అబు ఖతల్ పాటు తన భద్రతా గార్డు కూడా చనిపోయాడు. మరో గార్డుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థలో అబు ఖతల్ కీలక వ్యక్తిగా ఉన్నాడు. జమ్మూకశ్మీర్లో చోటు చేసుకున్న పలు దాడుల్లో అబు ఖతల్ హస్తం కూడా ఉంది. అంతే కాదు 26/11 ముంబై ఉగ్రదాడు సూత్రధారి హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు. గతేడాది జూన్ 9వ తేదీన జమ్మూకశ్మీర్ రియాసీ జిల్లాలోని శివఖోరి ఆలయం నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో అబు ఖతల్ కీలక పాత్ర పోషించాడు. అతడి నేతృత్వంలోనే ఈ దాడికి పథక రచన జరిగినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్లో ఉంటూ భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న కీలక ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కొక్కరిగా హతమారుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇండియన్ నేవీ ఆఫీసర్ కుల్ భూషణ్ జాదవ్ కిడ్నాప్లో కీలకంగా వ్యవహరించిన పాక్ స్పై ఏజెన్సీ ఐఎస్ఐకి చెందిన టెర్రరిస్ట్ ముఫ్తీ షామీర్ సైతం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో హతమయ్యాడు.
గత నెలలో లష్కర్-ఏ-తోయిబాకే చెందిన కీలక ఉగ్రవాదిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్లో హతమార్చారు. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యిద్ బావమరిది మౌలానా ఖషీఫ్ అలీని పాకిస్థాన్లోని స్వాబీలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించాడు. వీరితో పాటు భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడ్డ, ప్రయత్నించిన పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్లోనే హతమవుతున్నారు. వారందరినీ గుర్తు తెలియని వ్యక్తులే చంపేస్తున్నారు. మరి ఇదంతా చేస్తున్నది ఎవరో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే.
![]() |
![]() |