ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 నెలలు అంతరిక్షంలో ఉన్నందుకు సునీతా విలియమ్స్‌కు అదనపు జీతం

international |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 07:51 PM

వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలకు వెళ్లిన వ్యోమగాములు సునీతి విలియమ్స్, బుల్ విల్‌మోర్‌లు అక్కడే చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 9 నెలల పాటు అక్కడే ఉన్న వీళ్లు భూమ్మీదకు రాబోతున్నారు. ఈక్రమంలోనే వీరి జీతభత్యాల ఎంతో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు గాను నాసా వీరికి ఏమైనా ఎక్కువ డబ్బులు ఇస్తుందా, ఇస్తే ఎంత మొత్తంలో అధికంగా చెల్లిస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


నాసా ఉద్యోగులు కూడా అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీత భత్యాలనే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ జీఎస్-13 నుంచి జీఎస్-15 కింద చెల్లింపులు చేస్తారు. ముఖ్యంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు అత్యధిక గ్రేడ్ జీఎస్-15 గ్రేడ్ పే జీతం అందుకున్నారు. ఈ లెక్కన వీరిద్దరికీ ఏడాదికి లక్షా 24 వేల 133 డాలర్ల నుంచి లక్షా 62 వేల 372 డాలర్లక వరకు ఉంటుంది. భారత కరెన్సీ ప్రకారం రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు మధ్య జీతం చెల్లిస్తుంటారు.


అయితే వీరు అంతరిక్షంలోకి వెళ్లినా కూడా ఇదే స్థాయిలో జీతాన్ని చెల్లిస్తారట. ఉద్యోగ పనుల నిమిత్తమే వారు అక్కడకు వెళ్లారు కాబట్టి.. భూమ్మీద ఇచ్చినంతే ఇస్తారు. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ రోజులు పని చేసినప్పటికీ ఈ వ్యోమగాములకు ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవని.. నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్‌మన్ తెలిపారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు అంతరిక్షంలో ఆహారం, బస ఖర్చులను నాసాయే భరిస్తుందని వివరించారు. ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తారని అన్నారు.


అది కూడా చాలా తక్కువ అని.. ముఖ్యంగా రోజుకు 4 డాలర్లు మాత్రమే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తాను 2010-11 మిషన్‌లో భాగంగా 159 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నానని.. అందుకు తనకు సాధారణంగా వచ్చే జీతం కంటే 636 డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.348) అధికంగా చెల్లించినట్లు చెప్పారు. ఈ లెక్కన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లకు తొమ్మిది నెలలకు 1100 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.లక్ష) మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఇదంతా ఇలా ఉండగా.. 2024 జూన్ 5వ తేదీన సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు 8 రోజుల పర్యటనలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. కానీ వారు వెళ్లిన వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా వీరిని తీసుకు వచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు కలిసి క్రూ-10 మిషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా.. విజయవంతంగా డాకింగ్ పూర్తయింది. మరో మూడు రోజుల్లోనే వీరు భూమ్మీదకు రాబోతున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com