ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కల్యాణ్ డబ్బింగ్ వ్యాఖ్యలపై డీఎంకే నేతల ఫైర్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 07:50 PM

త్రిభాషా విద్యా విధానం విషయంలో అటు తమిళనాడు సర్కారు, ఇంటు కేంద్ర ప్రభుత్వం మధ్య చాలా రోజులుగా గొడవ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ దీనిపై స్పందించి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ చెబుతున్న తమిళనాడు.. తమిళ సినిమాలన్నింటినీ హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తుందని ప్రశ్నించారు. దీనిపై తాజాగా డీఎంకే నేతలు స్పందించారు. పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడారంటూనే.. తమిళనాడు వైఖరిని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. ఆ పూర్తి వివారలు మీకోసం.


ఆంధ్ర ప్రదేశ్‌లోని పిఠాపురంలో శుక్రవారం నిర్వహించిన సభలో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. త్రిభాషా వాదన సరికాదని.. భారత దేశానికి బహు భాషలు కావాలని చెప్పారు. డీఎంకే నేతలు దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారని చెబుతున్నారని.. అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. యూపీ, బిహార్ వంటి ప్రాంతాల నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ వద్దా అంటూ వ్యాఖ్యానించారు. ఇదేం న్యాయం అంటూనే రూపాయి సింబల్ మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్తైనా ఆలోచన ఉండాలంటూ ఫైర్ అయ్యారు.


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే సీనియర్ నేత ఎళన్ గోవన్ స్పందిస్తూ.. తమిళనాడు భాషా విధానం చాలా కాలంగా స్థిరంగా ఉందని చెప్పుకొచ్చారు. 1938 నుంచి తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతోందని.. 1968లో ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామంటూ రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని కూడా ఆమోదించుకున్నామని వివరించారు. అందరి సలహాలు, సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ బిల్ పాస్ అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఇంకా పుట్టి ఉండరని పేర్కొన్నారు.


అంతేకాకుండా తమిళ రాజకీయాలపై పవన్ కల్యాణ్‌కు ఏమాత్రం అవగాహన లేదని ఎళన్ గోవన్ వ్యాఖ్యానించారు. మాతృభాషలో విద్య, ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి ఉత్తమమైన మార్గం అని తాము భావిస్తున్నామని.. అందుకే హిందీని వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు. బీజేపీ నేతలను ఆకట్టుకోవడానికి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. దాని ద్వారా ఆయనకు ఏదైనా లాభం కూడా చేకూరే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు.


మరోవైపు డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తామెప్పుడూ అడ్డుకోలేదని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎ శ్రీస్కూల్స్ వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలంవంతంగా హిందీ భాషను రుద్దుతోందని చెప్పారు. అందుకే తాము దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa