అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో యెమెన్లోని హౌతీ రెబల్స్ స్థావరాలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో కనీసం 20 మంది మృతిచెందినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. రాజధాని సనాలోని శనివారం అమెరికా వైమానిక దాడుల్లో చిన్నారులు సహా పౌరులు చనిపోయినట్టు హౌతీ రెబల్స్ ప్రకటించారు. ఎర్ర సముద్రంలో హౌతీల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, వారికి చావుదెబ్బ తప్పదంటూ ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యెమెన్ తిరుగుబాటు గ్రూపుపై వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి.
గాజాలో ఇజ్రాయేల్ యుద్ధం మొలుపెట్టిన తర్వాత ఎర్ర సముద్రంలో ఆ దేశంతో పాటు వారి మిత్రదేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హౌతీలపై చర్యలను అమెరికా వేగవంతం చేసింది. ఈ క్రమంలో శనివారం వైమానిక దాడులతో విరుచుకుపడింది. దాడులకు ముందు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ఎర్ర సముద్రంలో నౌకలకు హౌతీల బెదిరింపులను ఉటంకిస్తూ మా లక్ష్యాన్ని సాధించే వరకు అధిక సైనిక శక్తిని ఉపయోగించే ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేశారు.
కాగా, దాడులపై స్పందించిన హౌతీలు ప్రతిస్పందన లేకుండా ఈ దాడులు ముగియవు ప్రకటించారు. ‘ఈ దురాక్రమణకు ప్రతిస్పందన తప్పకుండా ఉంటుంది .. మా యెమెన్ సాయుధ దళాలు తీవ్రతను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి’ అని యెమెన్ రాజకీయ విభాగం అల్-మసిరా టెలివిజన్లో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, హౌతీలకు తక్షణమే ఇరాన్ తన మద్దతు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఎర్ర సముద్రంలోని ఇజ్రాయేల్, అమెరికా, వాటి మిత్రదేశాల నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. దీంతో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఆ మార్గంలో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈనేపథ్యంలో హౌతీలపై అమెరికా దాడులు కొనసాగిస్తోంది. ఇందుకు కొన్నిసార్లు బ్రిటన్ సైన్యం సాయం కూడా తీసుకుంటోంది. మరోవైపు, జనవరి మూడో వారం నుంచి గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకవడంతో హౌతీలు దాడులు కూడా ఎర్ర సముద్రంలో ఆగాయి. అయితే, సాలస్తీనియన్లకు మద్దతుగా మళ్లీ దాడులను ప్రారంభిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది.
![]() |
![]() |