ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ సైనిక కాన్వాయ్‌‌పై దాడి.. షాకింగ్ వీడియో విడుదల చేసిన బీఎల్ఏ

international |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 11:18 PM

పాకిస్థాన్ పారామిలటరీ బలగాల వాహన శ్రేణిపై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్ల జరిపిన ఈ దాడిలో ముగ్గురు పాక్ సైనికులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. తాజాగా, ఆత్మాహుతి దాడికి సంబంధించిన వీడియోను బీఎల్ఏ విడుదల చేసింది. బలూచిస్థాన్‌లోని నోష్కి సమీపంలో జాతీయ రహదారిపై పాకిస్థాన్ పారామిలటరీ దళాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని.. మిలిటెంట్లు దాడి చేసింది. అచ్చం 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన ఆత్మాహుతి దాడి మాదిరిగానే బీఎల్ఏ మిలిటెంట్లు ప్లాన్ చేయడం గమనార్హం.


ఏడు బస్సులు, రెండు కార్లతో వెళ్తోన్న పారా మిలటరీ బలగాల కాన్వాయ్‌ను టార్గెట్ చేశారు. కాన్వాయ్‌లోని రెండో బస్సును మొదటి ఐఈడీ ఉన్న వాహనంతో ఢీకొట్టారు. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించి.. బస్సు మంటల్లో కాలిబూడిదయ్యింది. అనంతరం.. దాని వెనుకున్న మరో బస్సుపైకి రాకెట్ ప్రొపెల్లడ్ గ్రనేడ్‌ విసిరి కాల్పులు జరిపారు. బీఎల్ఏ ఆత్మాహుతి విభాగం ది మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి దాడి చేయగా.. మరో మిలిటెంట్ టీమ్ ఫతేహ్ స్వ్యాడ్ రెండో బస్సును చుట్టుముట్టింది.. ప్రస్తుతం బీఎల్ఏ మిలిటెంట్ల విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


భద్రతా బలగాలు క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తుండగా కాన్వాయ్‌పై దాడి జరిగిందని, కాన్వాయ్‌లోని ఏడు బస్సులు, రెండు కార్లను మిలిటెంట్ల లక్ష్యంగా చేసుకున్నారని పాక్ సైనిక అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలిలో లభ్యమైన ఆధారాలు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం నడుపుకుంటూ వచ్చిన ఫిదాయి.. కాన్వాయ్‌లోని బస్సును ఢీకొట్టినట్టు స్పష్టం చేస్తున్నాయని పాక్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. బస్సును ఢీకొట్టిన అనంతరం కాల్పులు జరిపారని, కానీ, వీటిని సైన్యం తిప్పికొట్టిందని చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమమయ్యారని, ఆత్మాహుతి దాడిలో ముగ్గురు సైనికులు సహా ఐదుగురు చనిపోయారని వెల్లడించారు.


ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాబ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. పిరికిపంద చర్యలు ఉగ్రవాదంపై తమ పోరాటాన్ని అడ్డుకోలేవని అన్నారు. అయితే, వారం రోజుల వ్యవధిలోనే బీఎల్ఏ మిలిటెంట్లు రెండు భారీ దాడులు చేయడం గమనార్హం. గతవారం క్వెట్టా నుంచి పెషావర్‌కు 440 మంది ప్రయాణికులతో వెళ్తోన్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బీఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సైనికులు సహా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్, అఫ్గన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్‌లో బీఎల్ఏ అత్యంత శక్తివంతమైన వేర్పాటువాద సంస్థ. తరుచూ పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com