ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 నెలల తర్వాత భూమ్మీదకు వస్తున్న సునీతా ఎదుర్కోబోయే సమస్యలు

international |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 11:17 PM

వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల కోసం వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు అక్కడే చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. వ్యోమనౌకలో వచ్చిన సమస్యల వల్ల 9 నెలలు అక్కడే ఉండిపోయిన ఈ ఇద్దరు మానసికంగా, శారీరకంగా చాలానే సమస్యలు ఎదుర్కున్నారు. కానీ భూమ్మీదకు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా మంగళ వారం రోజే భూమ్మీదకు రాబోతున్న వీళ్లు బేబీ ఫీట్, బ్రెయిన్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2024 జూన్ 5వ తేదీన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు 8 రోజుల పర్యటనలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే వీరు వెళ్లిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వారు 9 నెలలు అక్కేడ ఉండాల్సి వచ్చింది. ఇన్ని రోజుల పాటు వారు భూమ్మీదకు ఎప్పుడు వెళ్తామా అని ఆలోచిస్తూ.. అటు మానసికంగా, ఇటు శారీరకంగా చాలానే సమస్యలు ఎదుర్కున్నారు. ముఖ్యంగా నడవడం, పడుకోవడం కూడా మర్చిపోయానంటూ నేరుగా సునీతా విలియమ్స్‌యే ప్రకటించింది.


కుటుంబాన్ని మిస్ అయ్యామనే బాధను మనసులోనే దిగమింగుకుంటూ.. తాము భూమ్మీదుకు రాబోయే క్షణాల గురించి ఆలోచించారు. అయితే తాజాగా వీరిని తీసుకు వచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు కలిసి క్రూ-10 మిషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా.. విజయవంతంగా డాకింగ్ పూర్తయింది. మంగళ వారం రోజే వీరు భూమ్మీదకు తిరిగి రాబోతున్నట్లు నాసా కూడా ప్రకటించింది. ఈక్రమంలోనే వీరు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉందని.. నిపుణులు చెబుతున్నారు.


గతంలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగామి టెర్రీ విర్ట్స్ భూమ్మీదకు వచ్చి అలవాటు పడేందుకు ఎదుర్కున్న సమస్యలను తెలిపారు. ముందుగా తల తిరగడం ప్రారంభం అయిందని.. ఆ తర్వాత కోలుకోవడానికి తనకు వారాల సమయం పట్టిందన్నారు. సుదీర్ఘ కాలం అంతరిక్ష ప్రయామం తర్వాత వ్యోమగాములు బేబీ ఫీట్ సమస్యను అనుభవిస్తారని పేర్కొన్నారు. అంతరిక్షంలో తేలియాడుతుండడం వల్ల పాదాలపై కాలిస్ మాయం అవుతుందని అన్నారు. ముఖ్యంగా చర్మంపై ఉన్న మందపాటి భాగాన్ని కోల్పోతారని చెప్పారు.


అలాగే ఎముకల సాంద్రత, కండరాల క్షీణతను కూడా అనుభవిస్తారని వివరించారు. వ్యాయామం, పునారావాసం ద్వారా దీన్ని ఎదుర్కోలేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్నారు. కొత్త ఎముక కణజాలాన్ని నిర్మించే కణాలు కూడా నెమ్మదిస్తాయన్నారు. అయితే పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే కణాలు అదే వేగంతో కొనసాగుతాయన్నారు. ప్రతీ నెలా వ్యోమగామి బరువు మోసే ఎముకలు ఒక శాతం సాంధ్రతను కోల్పోయి.. ఫలితంగా బలహీనంగా, పెళుసుగా మారుతాయని చెప్పుకొచ్చారు.


9 నెలలు అంతరిక్షంలోనే గడిపిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఈ సమస్యలను ఎదుర్కుంటారని వ్యోమగామి టెర్రీ విర్ట్స్ స్పష్టం చేశారు. ఇవి మాత్రమే కాకుండా అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల మొదడు, ప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతాయన్నారు. మెదడులో ద్రవం పెరగడం వల్ల వినికిడి, దృష్టి లోపాలు, సెరిబ్రల్ ఎడెమా వస్తుందన్నారు. అలాగే మెదడుపై ఒత్తిడి పెరగడం వల్ల స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అని పిలిచే రుగ్మత కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.


ఇవి మాత్రమే కాకుండా రక్తం తగ్గడం వల్ల రక్తపోటును నియంత్రించడం కష్టం అవుతుందని.. దీని వల్ల తల తిరగడం, వికారం, మూర్ఛపోవడం వంటివి జరిగే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉందన్నారు. రేడియేషన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. క్యాన్సర్, కేంద్ర నాడీ వ్యవస్థలో సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. చూడాలి మరి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోబోతున్నారనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com