విహార యాత్ర కోసం కరేబియన్ దేశం డొమెనిక్ రిపబ్లిక్కు వెళ్లి అదృశ్యమైన భారత సంతతి అమెరికా విద్యార్ధిని సుదీక్ష కోణంకి కేసు మిస్టరీగా మారింది. ఆమెకు ఏమైందో? ఎక్కడ ఉందో? తెలుసుకునేందుకు పెద్ద ఎత్తునే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఆమె మిస్సింగ్ వ్యవహారంపై తాజాగా ఇంటర్పోల్ స్పందించింది. ఆమె ఆచూకీ కోసం గ్లోబల్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బాధితులు కనిపించకుండాపోవడం లేదా అపహరణకు గురవడం వంటి సందర్భాల్లో ఎల్లో నోటీసు జారీచేస్తుంది. 20 ఏళ్ల సుదీక్ష ఎత్తు 1.6 మీటర్లు ఉంటుందని, కుడిచెవిపై మూడు కుట్లు ఉంటాయని ఆమె ఆనవాళ్లను అందులో పేర్కొంది.
పెన్సుల్వేనియాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోన్న వర్జీనియాకు చెందిన సుదీక్ష.. మార్చి 6న స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లి కనిపించకుండా పోయింది. వెకేషన్ కోసం సుదీక్ష, ఆమె ఐదుగురు స్నేహితురాళ్లు కలిసి డొమినిక్ రిపబ్లిక్కు వెళ్లి. పుంటా కానాలోని ఓ రిసార్ట్లో బసచేశారు. స్నేహితులతో కలిసి ఆమె బీచ్లో నడుస్తున్నట్టు సమీపంలోని నిఘా కెమెరాల్లో రికార్డయ్యింది. అయితే, సుదీక్ష తప్ప మిగతావారు హోటల్కు తిరిగి వచ్చేశారు. కానీ, చివరిగా ఆమె మిన్నెసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్శిటీలో సీనియర్ అయిన జౌషా రీబ్తో కనిపించింది.
కనిపించకుండాపోయిన రోజు రాత్రి సుదీక్ష తనతో ఉన్నట్టు అతడు అంగీకరించాడు. ‘బీచ్ ఒడ్డున నడుము లోతు నీటిలో మాట్లాడుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటూ" ఉండగా బలమైన కెరటం వచ్చి సముద్రంలోకి లాగింది’ అని రీబే చెప్పాడు. ఈ సమయంలో ఈదుకుంటూ నేను ఆమె చేయి పట్టుకోడానికి ప్రయత్నించాను.. కానీ అప్పటికే నీళ్లు తాగేయడంతో నాకు ఊపిరి ఆడక ఇబ్బందిపడ్డాను.. అల నుంచి తప్పించుకున్న తర్వాత నీకు బాగానే ఉందా? అని అడిగాను.. కానీ ఇంతలోనే నేను వాంతులు చేసుకుని స్పృహకోల్పోయాను.. నేను కోలుకునేటప్పటికి ఆమె ఎక్కడా కనిపించలేదు. వెళ్లిపోయిందని భావించి కొద్ది గంటల తర్వాత హోటల్కు తిరిగొచ్చాను’ అని చెప్పాడు. రీబ్ ఒక్కడే వస్తున్న దృశ్యాలు నిఘా కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఆమె దుస్తులు, పాదరక్షలు బీచ్ ఒడ్డున లబించాయి. దీంతో ఆమె నీళ్లలోనే కొట్టుకోపోయిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.. నిఘా కెమెరా వీడియోలో రీబ్తో చివరిగా ఉన్నట్టు వెల్లడయ్యింది.
![]() |
![]() |