ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన చేపట్టాక మహిళలపై నేరాలు తగ్గాయని చట్టసభల సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ఖండించిన ఆమె.. ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. ‘‘మహిళల పై నేరాలు తగ్గాయని సభసాక్షిగా హోం మంత్రి అనిత అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళల పై 70 సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పదినెలల్లో మహిళల పై నేరాలు దాడులు పెరిగాయి. అలాంటప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నించడం?. లెక్కలు క్లియర్గా ఉంటే మరి మోసం చేయడం ఎందుకు?.. అని నిలదీశారామె. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. దిశా యాప్ను తెచ్చారు. దిశా యాప్ పైన ఇదే మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తి యాప్ అని తెచ్చారు. మహిళా దినోత్సనం రోజున శక్తి యాప్ ప్రారంభించారు. కేవలం పదిరోజుల్లోనే కోటి 49 లక్షల మంది శక్తి యాప్ ను డౌన్ లోడు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. కృష్ణాజిల్లాలో 14 ఏళ్ల బాలిక పై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంత దారుణాలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. మహిళల పై నేరాలు పెరగడానికి కారణం మద్యం,గంజాయి,డ్రగ్స్. సీఎం చంద్రబాబు నివాసముంటున్న జిల్లాలోనే డ్రగ్స్ దొరికాయి. గంజాయిని కంట్రోల్ చేయడానికి ఈగల్ తెచ్చామంటున్నారు సంతోషం. కానీ, జగన్ మోహన్ రెడ్డి గతంలో సెబ్ తెచ్చారు. సెబ్ డీజీపీ కంట్రోల్లో ఉండేది. సెబ్ను తీసేసి ఈగల్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు. కానీ, ప్రభుత్వం మాటలు కాకుండా చేతలతో చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని హితువు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa