ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నేవీ అధికారిని చంపిన భార్య జైల్లో డిమాండ్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 07:37 PM

మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ప్రియుడి సాయంతో భర్తను అతికిరాతకంగా హత్యచేసిన భార్య.. శవాన్ని 15 ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితురాలు ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌కు సంబంధించి మరిన్ని విస్తుగొలిపే విషయాలను పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన ఇద్దరూ.. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు కావాలని అడుగుతున్నారని పేర్కొన్నారు. అరెస్టైనప్పటి నుంచి డ్రగ్స్ దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తరచూ గంజాయి కోసం డిమాండ్‌ చేస్తున్నారని వివరించారు.


జైలుకు వచ్చిన రోజు నుంచే నిందితుల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైందని అధికారులు తెలిపారు. దీంతో సాహిల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తే.. అక్కడ నానా హంగామా చేసి.. గందరగోళం సృష్టించాడన్నారు. గంజాయి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. వారి మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల తోటి ఖైదీలపై దాడి చేసే ప్రమాదం ఉండటంతో వేరుగా ఉంచినట్లు చెప్పారు. ముస్కాన్, ఆమె ప్రియుడు రోజూ డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకున్నట్టు గుర్తించామని.. అవి లేకపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. సౌరభ్ హత్య సమయంలోనూ సాహిల్‌ డ్రగ్స్‌ మత్తులోనే ఉన్నట్లు భావిస్తారు. ఈ నేపథ్యంలో వారికి జైలులోని డీ అడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.


ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ మర్చెంట్ నేవీలో పనిచేస్తూ.. 2016లోప్రేమించిన ముస్కాన్ రస్తోగిని వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతోనే ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంలో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయి. అది భరించలేకపోయిన సౌరభ్ తన భార్యను తీసుకుని అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. భార్యను చాలా ప్రేమగా చూసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా 2019లో ఓ పాప కూడా పుట్టింది.


తన భర్త స్నేహితుడు సాహిల్‌తో ముస్కాన్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలిసిన సౌరభ్ భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ కుమార్తె జీవితం నాశనం అవ్వడం ఇష్టం లేక భార్యతోనే కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో 2023లో మళ్లీ నేవీ ఉద్యోగంలో చేరాడు. దీంతో ముస్కాన్‌కు మరింత స్వేచ్ఛ దొరికింది. అయితే, తన కుమార్తె పుట్టిన రోజుకోసం భర్త రావడంతో అతడు అడ్డుగా ఉన్నాడని భావించింది. ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసి.. శవాన్ని ముక్కలుగా కోసి.. డ్రమ్ములో వేసి సీల్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa