ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీటిల్లో అధిక వడ్డీ, లాభం.. ఎస్బీఐ 2 స్పెషల్ స్కీమ్స్

business |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 10:15 PM

భారతీయ స్టేట్ బ్యాంక్ వివిధ రకాల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తోంది. పెట్టుబడిదారుల వివిధ అవసరాలను తీర్చడానికి ఈ పథకాల్ని తీసుకొచ్చింది. కొన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు నిర్దిష్ట గడువు తేదీ ఉంది. మరికొన్ని పథకాలకు గడువు తేదీ లేదు. వీటిల్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఎస్బీఐ స్పెషల్ స్కీమ్స్.. అత్యధిక వడ్డీ అందించేటువంటి.. ఎస్బీఐ అమృత్ వృష్టి, ఎస్బీఐ అమృత్ కలశ్ వంటి డిపాజిట్లకు పెట్టుబడికి చివరి తేదీ ఉంది. 2025, మార్చి 31 వీటికి ఆఖరి తేదీ. ఆలోపే ఇందులో చేరేందుకు అవకాశం ఉంది. ఇక ఎస్బీఐ సర్వోత్తమ్ ఎఫ్డీ, ఎస్బీఐ గ్రీన్ డిపాజిట్లు, ఎస్బీఐ పాట్రన్స్, ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ వంటి ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎలాంటి గడువు తేదీ లేదని గుర్తుంచుకోవాలి.


వీకేర్ పథకం కేవలం సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులో ఉంది. సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ పాట్రన్స్ పథకాన్ని ఇటీవల ఎస్బీఐ లాంఛ్ చేసింది. ఇప్పుడు వేటిల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


ఎస్బీఐ అమృత్ వష్టి


ఇది 444 రోజుల టెన్యూర్‌తో ఉన్న ఎఫ్‌డీ స్కీమ్. ఇక్కడ సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.25 శాతం వడ్డీ రేటు ఉంది. సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం మేర వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంకులో ప్రస్తుతం అత్యధిక వడ్డీ రేటు అందేది ఈ పథకంపైనే కావడం విశేషం. మార్చి 31లోగానే చేరేందుకు అవకాశం ఉంది.


ఎస్బీఐ అమృత్ కలశ్


ఇది కూడా మంచి ఆదరణ ఉన్న పథకమే. ఇక్కడ 400 రోజుల టెన్యూర్‌తో ఉంది. సాధారణ ప్రజలకు ఇక్కడ వార్షిక ప్రాతిపదికన 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.60 శాతం చొప్పున వడ్డీ రేటును అందిస్తుంది.


ఇతర పథకాల్ని పరిశీలిస్తే.. సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేకంగా ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ ఉంది. వీటిపై సాధారణ రేటు కంటే 50 బేసిస్ పాయింట్లు అదనంగా వస్తుంది. ఇక సాధారణ ప్రజల కంటే 100 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ వస్తుందని చెప్పొచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపైనే ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఇందులో వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది. రెగ్యులర్ డిపాజిట్లపై ఇక్కడ 6.50 శాతం వడ్డీ రేటు మాత్రమే ఉంది.


ఎస్బీఐ సర్వోత్తమ్ ఎఫ్డీ


ఈ పథకం విషయానికి వస్తే.. ఇక్కడ కూడా సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇక్కడ బ్యాంక్ రెండు సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 7.4 శాతం చొప్పున వడ్డీ రేటును అందిస్తుంది. ఒక సంవత్సరం కాలానికి వడ్డీ రేటును 7.10 శాతంగా నిర్ణయించారు. సీనియర్ సిటిజన్లకు సాధారణ పెట్టుబడిదారులకు అందించే వడ్డీ రేటు కంటే అదనంగా 50 బేసిస్ పాయింట్ల ప్రీమియం లభిస్తుంది. వీరికి వరుసగా 7.90 శాతం, 7.60 శాతం మేర వడ్డీ రేట్లు ఉన్నాయి.


ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్‌.. పర్యావరణ అనుకూల కార్యకలాపాలు, ప్రాజెక్టులకు నిధులు సేకరించడానికి ఉద్దేశించింది. ఈ డిపాజిట్ స్కీమ్ కింద బ్యాంకు 1111 రోజులు, 1777 రోజులు, 2222 రోజుల కాలానికి వరుసగా 6.65 శాతం, 6.65 శాతం, 6.40 శాతం వడ్డీ రేట్లు అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు వరుసగా 7.15, 7.15, 7.40 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది.


ఎస్బీఐ ప్యాట్రన్స్..


సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ కొత్త టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. దీని పేరు ఎస్బీఐ పాట్రన్స్. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194P ప్రకారం, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసితులు సూపర్ సీనియర్ సిటిజన్లుగా పరిగణించబడతారు. 'SBI పాట్రన్స్' పథకం కింద, సూపర్ సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్లకు వర్తించే రేట్ల కంటే 10 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ రేటును అందిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa