రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని....అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సీఎం సూచించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి... వారు ఎండలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా వడదెబ్బ మరణాలు నివారించవచ్చని అన్నారు. మార్కెట్లు, బస్స్టాండ్లు, కూలీ అడ్డాలు, ఇతర జన సమూహం ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ శాఖల పరంగా సహకారం అందించాలని సూచించారు. 2014-19 మధ్య కూడా ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం తరఫున మజ్జిగ అందించామని... ఈసారి కూడా ఎండలు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాసం కొరతతో పాటు పశువులకు తాగునీరూ లభించని పరిస్థితి ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అనేది అధికారులు గ్రహించి, ఆ మేరకు ప్రభుత్వ ఆలోచనలను అమలు చేయాలని సీఎం అన్నారు. వేసవిలో పశువులు, పక్షుల దాహాన్ని తీర్చుకోడానికి ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa