కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. గోరంట్లప్ప, కెబి. శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 27న కర్నూలు సాక్షి యూనిట్ కార్యాలయంపై ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చేసిన దాడిని నిరసిస్తూ శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు శివ శంకర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. వాస్తవాలు రాసిన జర్నలిస్ట్ లపై, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం, జర్నలిస్టులను భయాందోళనకు గురిచేయడం సరైంది కాదని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయడం మానేసి అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే అఖిల ప్రియ తమ అనుచరులతో సాక్షి కార్యాలయం పైకి దాడికి దిగి భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలకవర్గాలు జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించడం మానేసి దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో రోజు రోజుకు జర్నలిస్ట్ పై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి జర్నలిస్ట్ లకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, దాడికి పాల్పడిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![]() |
![]() |